టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టండి | Telangana Development Possible With KCR | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టండి

Nov 10 2018 8:06 PM | Updated on Nov 10 2018 8:09 PM

Telangana Development Possible With KCR - Sakshi

బ్రాహ్మణపల్లిలో దాసరి ప్రచారం 

పెద్దపల్లిరూరల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్‌ఎస్‌ పుట్టిందని, అలాంటి ఇంటి పార్టీతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకుందామని పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళహారతులు, పూలమాలలతో ఘనంగా స్వాగతించారు. ప్రతి ఓటరును నేరుగా కలిసి కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మరో అవకాశమిచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. విపక్ష పార్టీలకు అధికారం దక్కించుకోవాలన్న ఆలోచన తప్ప అభివృద్ధిపై ఎలాంటి ధ్యాస లేదన్నారు. 

సీట్ల కేటాయింపుకే ఇన్ని రోజులు తీసుకున్న పార్టీలకు అవకాశమిస్తే సీఎం ఎవరో తేల్చుకోవడానికే కుస్తీలు పడతారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు మరిన్ని తోడవుతాయన్నారు. రైతాంగ సంక్షేమానికి, మహిళాభ్యున్నతికి ఆయన వేసిన బాటలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఆయన వెంట నాయకులు రాజేందర్‌యాదవ్, ఇనుగాల తిరుపతిరెడ్డి, రాజు, సతీష్, కొమురయ్య, మల్లేశం తదితరులున్నారు.

ఎస్సి సెల్‌ నాయకుల ప్రచారం:

ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరుతూ మండల ఎస్సీ సెల్‌ నాయకులు శుక్రవారం మండలంలోని రచ్చపల్లి, కానంపల్లి, రామయ్యపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీల్లోని మహిళలు, ఓటర్లను కలుస్తూ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు వేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ప్రజలు సానుకులంగా ఉన్నారని మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మద్దునాల వెంకటేశం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడపాక శ్రీనివాస్, జుంజుపల్లి రమేశ్, రెడపాక పోచయ్య, రాజయ్య, కనుమండ రమేశ్, కాసీపాక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement