
గాయపడ్డ నిఖిల్
నాగోలు: ఉపాధ్యాయురాలు విద్యార్థిని డస్టర్తో కొట్టడంతో తల పగిలి తీవ్ర గాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. వివరాలు... ఎల్బీనగర్ గుంటి జంగయ్యనగర్ కాలనీకి చెందిన నరేష్ జీహెచ్ఎంసీలో పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు నిఖిల్(6) కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో నిఖిల్ అల్లరి చేయడంతో తెలుగు ఉపాధ్యాయురాలు సుజాత డస్టర్తో కొట్టింది. దీంతో నిఖిల్ తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు ఆ విద్యార్థికి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఎల్బీనగర్ పోలీసులకు, సరూర్నగర్ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.