ఇకపై కాగిత రహిత విధానంలోకి.. | Sakshi
Sakshi News home page

ఇకపై కాగిత రహిత విధానంలోకి..

Published Sun, Jan 27 2019 4:16 AM

State Police Department  to become paperless from May 1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో నిత్యం జరిగే ఉత్తరప్రత్యుత్తరాలను కాగిత రహిత (పేపర్‌లెస్‌) విధానంలోకి తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారు లు చర్యలు చేపట్టారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌గా యావ త్‌ పోలీస్‌ శాఖను ఆధునీకరిస్తున్న అధికారులు తాజా గా ఈ–ఆఫీస్‌ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా పలు జిల్లాలు, కమిషనరేట్లలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ–ఆఫీస్‌ విధానం విజయవంతం కావడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో దీన్ని అమల్లోకి తీసుకురావాలని అడ్మిన్‌ విభాగాల బాధ్యులకు రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. 

డీఎస్‌ఆర్‌ నుంచి బడ్జెట్‌ ప్రతిపాదనల వరకు
పోలీస్‌శాఖలో శాంతిభద్రతల విభాగాలపై నిత్యం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి నుంచి డీజీపీ వరకు ఉదయమే సమీక్ష జరుగుతుంది. నిన్న ఏం జరిగింది, నేడు చర్యలు ఏం తీసుకోవాలన్న డీఎస్‌ఆర్‌ (డైలీ సిచ్యుయేషన్‌ రిపోర్ట్‌)పై టెలి కాన్ఫరెన్స్, అవసరమైతే కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా ఆయా జిల్లాల ఎస్పీలు, డీజీపీ నిర్వహిస్తారు. ఇప్పటివరకు డీఎస్‌ఆర్‌లు కేవలం పేపర్లపై ప్రింట్‌ రూపంలో ఉన్నతాధికారులకు చేరేవి.

ఇకపై అలా కాకుండా ప్రతీ పోలీస్‌స్టేషన్‌ నుంచి ట్యాబ్‌ల ద్వారా ఆయా సర్కిల్, సబ్‌డివిజినల్, జిల్లా ఎస్పీ, డీఐజీ, ఐజీ, డీజీపీ వరకు ఆన్‌లైన్‌లో ఈ–ఆఫీస్‌ టూల్స్‌ ద్వారా క్షణాల్లో చేరిపోతాయి. కీలక కేసుల వివరా లు, క్రైమ్‌ డైరీ ఫైల్స్, చార్జిషీట్లు ఈ–ఆఫీస్‌ ద్వారానే పంపేందుకు పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది. దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్, సిద్దిపేట కమిషనరేట్లతో పాటు నాగర్‌కర్నూల్, కామారెడ్డి, టీఎస్‌ఎస్‌పీ (తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌), గ్రేహౌండ్స్‌ విభాగాల్లో ప్రారంభించారు. ఈ విధానం విజయవంతమవడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉపయోగించేలా చర్యలు తీసుకోబోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement