స్పెషల్‌ డైట్‌.. అదే రైట్‌

Special Diet For The Corona Patients In Government Hospitals - Sakshi

ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు ప్రత్యేక భోజనం

రోగ నిరోధకశక్తి పెరుగుదల కోసం పోషక విలువలున్న ఆహారం

పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో కట్టడికి పక్కా ప్రణాళిక

వైద్య, ఆరోగ్య శాఖ, ఎన్‌ఐఎన్‌ సంయుక్తంగా రూపకల్పన

గాంధీతోపాటు అన్ని ఆస్పత్రుల్లో ఇదే రకమైన డైట్‌ ఇవ్వాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ యమా యాక్టివ్‌గా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా అంతే యాక్టివ్‌గా స్పందిస్తోంది. స్పెషల్‌ డైట్‌ ఇచ్చి రోగుల శరీరం నుంచి కరోనాను సాగనంపాలని నిర్ణయించింది. కోవిడ్‌ బాధితుల రోగనిరోధకశక్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో పోషక విలువలున్న ప్రత్యేక భోజనం అందించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు కోవిడ్‌ బాధితుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 10 వేల యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగంమంది హోం క్వారంటైన్‌లో ఉండగా మిగతా వారు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌కు సరైన మందు లేకపోవడంతో రోగనిరోధకశక్తిని పెంచడమే వ్యాధిని జయించడానికి ఏకైక మార్గమని భావిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతోపాటు ఎన్‌ఐఎన్‌(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌) ఆధ్వర్యంలో ప్రత్యేక డైట్‌చార్ట్‌ రూపొందించింది. దీని ప్రకారం గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న ఈ డైట్‌ను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

వేగంగా కోలుకునేలా... 
కోవిడ్‌ పేషెంట్‌ వేగంగా కోలుకునేందుకు అదనపు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు అన్నివర్గాలు ప్రాధాన్యత ఇచ్చే ఆహార పదార్థాలనే డైట్‌చార్ట్‌లో పొందుపర్చారు. రోజూ తినే భోజనంతోపాటు కొన్ని అదనపు పోషకాల కింద ఉడికించిన కోడిగుడ్డు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ జోడించారు. కోవిడ్‌ రోగులకు ఆహారాన్ని తాజాగా, వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలని, అప్పుడే పోషకాలు పూర్తిస్థాయిలో శరీరంలోకి చేరతాయని, ఆ మేరకు వండిన వెంటనే ఆహారాన్ని ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

కరోనా పేషెంట్‌ డైట్‌చార్ట్‌ ఇలా.... 
► ఉదయం 7.30 నుంచి 8.00 గంటల మధ్య అల్పాహారం కింద ఇడ్లీ, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పలలో ఏదో ఒకదాన్ని అందిస్తారు. దీనితోపాటు కాచిన పాలు ఇస్తారు. 
► ఉదయం 10 గంటలకు బిస్కెట్లతోపాటు టీ లేదా కాఫీ ఇస్తారు.  
► మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య వరి అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, వెజ్‌కర్రీ, మినరల్‌ వాటర్‌ బాటిల్‌తోపాటు ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు అందిస్తారు. 
► సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల్లోపు ప్రత్యేక పోషకాహారంగా కాఫీ లేదా టీతోపాటు ఖర్జూరం, బాదంపప్పు ఇస్తారు. æ రాత్రి డిన్నర్‌లో అన్నంతోపాటు వెజిటబుల్‌ కర్రీ, సాంబార్, పెరుగు, పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు, మినరల్‌ వాటర్‌ అందజేస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top