కుటుంబ కలహాలతో కన్నతండ్రిని హతమార్చాడో ప్రబుద్ధుడు. దీనికి తల్లి సహకరించింది.
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : కుటుంబ కలహాలతో కన్నతండ్రిని హతమార్చాడో ప్రబుద్ధుడు. దీనికి తల్లి సహకరించింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కోకాపేట్ కాలనీకి చెందిన సల్లంగుల చంద్రయ్య(47) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతుండేవి.
కాగా శుక్రవారం తెల్లవారుజామున మరోసారి ఇంట్లో గొడవ జరగడంతో.. కోపంతో ఊగిపోయిన చంద్రయ్య కుమారుడు వెంకటేష్(19) పక్కనే ఉన్న గొడ్డలితో తండ్రి తలపై వేటు వేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న తల్లి అంజమ్మ(45) కూడా కుమారుడికి సహకరించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు.