నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి | Reiterated the decision | Sakshi
Sakshi News home page

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

Nov 23 2014 1:24 AM | Updated on Mar 18 2019 8:51 PM

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి - Sakshi

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరును పెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

  • ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ పేరు మార్పుచేస్తే సహించం
  • సోమాజీగూడ వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్ నేతల డిమాండ్
  • సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరును పెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.  విమానాశ్రయంలోని అంతర్జాతీయ, దేశీయ టెర్మినళ్లకూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు. ఎన్‌టీఆర్‌పై ప్రేమ ఒలకబోస్తున్న వారంతా.. ఆయన్ను చెప్పులతో కొట్టించినప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రచేసి ఈ నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు.  

    కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం (24న) అన్ని జిల్లాల్లో ధర్నా  కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. శనివారం సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద  నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, మహ్మద్ అలీ షబ్బీర్, వి.హనుమంతరావు, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, శ్రీశైలం గౌడ్, భిక్షపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు.

    రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు ఆ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం సైతం చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఇలా అవమానించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement