టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త | Puvvada Ajay Kumar Talks In Press Meet Over TSRTC Salaries In Hyderabad | Sakshi
Sakshi News home page

సమ్మె కాలానికి వేతనాలు విడదుల

Mar 11 2020 4:51 PM | Updated on Mar 11 2020 7:23 PM

Puvvada Ajay Kumar Talks In Press Meet Over TSRTC Salaries In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ స్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం మరోమారు రుజువైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చెప్పిన విధంగా సమ్మె కాలానికి సంబంధించిన జీతాల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం శుభపరిణామం అన్నారు. (ఒక్క కార్మికుడిని సస్పెండ్‌ చేయలేదు)

కాగా.. సమ్మె కాలానికి జీతాల చెల్లింపుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేసి ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని పువ్వాడ తెలిపారు. ఇది ఆయన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. ఒకే దఫాలో నిధులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. మార్చి 31వ తేదీలోగా సమ్మె కాలం జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లించనున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ అభ్యున్నతి కోసం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల బాగోగుల కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, సంస్థ ఆర్థిక స్థితిని మరింత మెరుగు పరచడానికి సమిష్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో చెప్పినట్లుగానే బడ్జేట్‌లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. సంస్థ పురోగతికై అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసి సీఎం  ఆశించిన ఫలితాలు తీసుకురావాలని మంత్రి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement