
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా... పల్లె పోరులో సర్పంచ్’ పదవుల ఆశావహుల మధ్య పోరును డబ్బు తీర్చేలా కనిపిస్తోంది. ఎన్నికల ఖర్చును భరించగల అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు వెదుకుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ డబ్బుదే కీలకపాత్ర కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ఖర్చు లేకుండా బయట పడేందుకు అధికార టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు.
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకత్వం బలంగా ఉన్నచోట వారూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్లో ఒక్కో పోటీదారు మాత్రమే ఉన్న పంచాయతీల్లో టీఆర్ఎస్లో మాత్రం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంతో ఒక్కరినే ఎంపిక చేయడం పార్టీ నాయకత్వానికి తలకు మించిన భారంగా పరిణమించింది. దీంతో ఎన్నికల్లో ఖర్చు పెట్టగలిగే, ఆర్థిక స్థోమత ఉన్నవారి పేర్లనే పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. కనీసం రూ.30లక్షల వరకైనా ఖర్చు పెట్టగలరా..? టికెట్ ఖరారు చేసే సమయానికి కనీసం రూ.10లక్షలన్నా డిపాజిట్ చేయగలరా అన్న కండీషన్లు పెడుతున్నారు. దీంతో సర్పంచ్ టికెట్ ఆశించే దశలోనే వడబోత కార్యక్రమాన్ని పక్కాగా చేస్తున్నారు.
మండల కేంద్ర పంచాయతీల్లో భారీ ఖర్చు?
జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలు ఉన్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయల్లో ఉండనుందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో అలాంటి మేజర్ పంచాయతీల్లో అభ్యర్థులు పోటీలు పడి భారీగా ఖర్చు చేశారు. అలాంటి వాటిలో కొన్ని పంచాయతీలు ఈసారి మున్సిపాలిటీలుగా మారాయి. అయినా, పాత మండల కేంద్రాలన్నీ కూడా మేజర్ పంచాయతీలుగానే ఉన్నాయి. దీంతో ఈ పంచాయతీల్లో అధికారం దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న పంచాయతీలు, భూముల ధరలు విపరీతంగా పెరిగిన పంచాయతీల్లో ఈసారి ఎన్నికలు ఖరీదుగా మారనున్నాయి.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆయా పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉండి, ఖర్చు పెట్టగల స్థోమత ఉన్న వారినే బరిలోకి దింపాలని యోచిస్తున్నాయి. ఇదే విషయాన్ని టికెట్ ఆశావహులకు చెబుతున్నారు. జిల్లాలోని నార్కట్పల్లి, కట్టంగూరు, తిప్పర్తి, మాడ్గులపల్లి, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, గుర్రంపోడు, మునుగోడు, సంస్థాన్ నారాయణపురం వంటి మండల కేంద్ర పంచాయతీల్లో ఎన్నికలకు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుం దని అంచనా వేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో తక్కువలో తక్కువగా రూ.50లక్షల కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
గ్రామాభివృద్ధికి చందా రూపంలో..!
మరోవైపు ఎన్నికల జోలికి పోకుండా, ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు గ్రామ సమస్యలు తీర్చేందుకు తమ వంతుగా గ్రామాభివృద్ధికి చందా రూపంలో కొంత మొత్తం డిపాజిట్ చేస్తామని కూడా కొందరు అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. గ్రామంలో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన బడ్జెట్లో సింహభాగం సొంతగా భరిస్తామని హామీ ఇస్తున్నారు. గ్రామ పెద్దలంతా కూర్చుని ఈ విషయాలపై ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని అంటున్నారు. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ పదికి ఏకంగా వేలంపాట పాడుతున్నారు.
తద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాలని తీర్మానించుకుంటున్నారు. దీంతో కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ పదవి రూ.25లక్షల నుంచి రూ.30లక్షల దాకా అమ్ముడు పోతోంది. ఇలాంటి పంచాయతీల్లో కొన్ని చోట్ల అధికార టీఆర్ఎస్కు చెందిన నేతల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారని అంటున్నారు. గత నెలలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.వెయ్యి ధర పలికింది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.500 మొదలు రూ.వెయ్యి దాకా పంచారు. దీంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సైతం ఒక్కో ఓటుకు ఇంతే మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కారణంగానే ఈసారి సర్పంచ్ పదవి.. కాస్ట్లీగా మారనుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.