పుంజుకోని రబీ సాగు
సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు ఇంకా పుంజుకోవడంలేదు. ఈ సీజన్లో సాధారణంగా 31.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ ఇప్పటివరకు కేవలం 11.25 లక్షల (35%) ఎకరాల్లోనే రబీ పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాస్తవంగా గతేడాది రబీలో ఇదే సమయానికి 12.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి ఏకంగా 1.45 లక్షల ఎకరాలు తేడా కనిపిస్తుంది. ఇక రబీలో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.22 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 3.37 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 2.67 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రబీ వరినాట్లు కూడా పెద్దగా పుంజుకోలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.02 లక్షల (13%) ఎకరాలకే నాట్లు పరిమితమయ్యాయి. వచ్చే నెల నుంచి వరి నాట్లు పుంజుకుంటాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.