మరీ 'వరి'మితం! | Budget allocations for Godavari Delta are meager | Sakshi
Sakshi News home page

మరీ 'వరి'మితం!

Feb 19 2026 5:56 AM | Updated on Feb 19 2026 5:56 AM

Budget allocations for Godavari Delta are meager

గోదావరి డెల్టాకు బడ్జెట్‌ కేటాయింపులు అరకొర

చూపిస్తున్నది రూ.200 కోట్లు 

రూ.70 కోట్ల మించి ఖర్చు చేయరు 

సాధారణ పనులకే రూ.500 కోట్లు కావాలంటున్న నిపుణులు 

కాలువల మరమ్మతులు, ఆధునికీకరణ ఇక కల్లే 

రబీలో నీరు పారదు.. ఖరీఫ్‌లో ముంపు వీడదు 

సాక్షి, అమలాపురం:  గోదావరి డెల్టా చిక్కి శల్యమైపోతోంది. ఆధునికీకరణ జరగకపోవడమే కాకుండా కనీసం చిన్నచిన్న మరమ్మతు పనులు కూడా చేయకపోవడంతో డెల్టా వ్యవస్థ అఠిదీంతో ఖరీఫ్‌లో ముంపు నీరు దిగే అవకాశం లేక చేలు మునిగిపోతుండగా.. రబీలో శివారులలో నీరందక చేలు ఎండిపోతున్నాయి. ఏటా ఇది క్రమం తప్పకుండా సాగుతున్న నేపథ్యంలో డెల్టా కాలువల మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎప్పటిలాగానే అరకొరగా నిధులు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది.        

గోదావరి డెల్టా మొత్తం ఆయకట్టు 10.60 లక్షల ఎకరాలు. దీనిలో వరి సాగు 8.90 లక్షల ఎకరాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలో 4.55 లక్షల ఎకరాల వరి ఆయకట్టు ఉండగా,  ప్రస్తుతం కోనసీమ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల వరి ఆయకట్టు డెల్టా కాలువ వ్యవస్థ మీద ఉంది. దీని ఆధునీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో రూ.1,660 కోట్లు కేటాయించారు. ఆయన మృతితో పనులు ఆగిపోయాయి. 

ఏటా చేపట్టే తాత్కాలిక పనులు తప్ప పక్కాగా ఆధునీకరణ పనులు జరగం లేదు. దీనితో పంట కాలువలు, మురుగునీటి కాలువలు పూడుకుపోయాయి. కనీస మరమ్మతులు జరగడం లేదు. తూడు, గుర్రపు డెక్క తొలగించడం లేదు. షట్టర్లు దెబ్బతిన్నాయి. లాకుల వద్ద, శివారు ప్రాంతాల్లో రెగ్యులేటర్ల వద్ద నీరు వృథాగా పోతోంది. దీనివల్ల నీటి యాజమాన్యం అస్తవ్యస్తంగా మారింది. ముంపునీరు దిగక చేలు చెరువులుగా మారిపోతున్నాయి. శివారుల్లో ఏటా సుమారు 40 వేల ఎకరాల్లో తొలిపంట సాగుకు రైతులు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో డెల్టాలో మరోసారి ఆధునికీకరణ పనులు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డెల్టాకు రూ.రెండు వందల కోట్లు కేటాయించినట్టు చూపించారు. గత ఏడాది కూడా ఇలానే బడ్జెట్‌లో రూ.200 కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. తరువాత సవరించిన బడ్జెట్‌లో రూ.70 కోట్లు అని తెలిపారు. కాని వాస్తవంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.పది కోట్లు కూడా ఖర్చు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది కూడా రూ.200 కోట్లు అని చెబుతున్నా దీనిలో పావు వంతు కూడా ఖర్చు చేస్తారనే నమ్మకం డెల్టా రైతులకు కలగడం లేదు.  

ఖరీఫ్‌లో ముంపు... రబీలో ఎద్దడి 
కొన్నేళ్లుగా డెల్టా కాలువల ఆధునికీకరణ లేకుండా పోయింది. దీనితో డెల్టా కాలువలు తూడు, గుర్రపు డెక్కతో పూడుకుపోయాయి. మురుగునీటి కాలువలు అయితే కబ్జాల బారిన కూడా పడ్డాయి. ఈ కారణంగా దీనితో ఖరీఫ్‌లో మునిగిపోవడం.. రబీలో ఎండిపోవడంతో రైతులు కోట్ల రూపాయల నష్టాలను భరిస్తున్నారు. మురుగునీటి కాలువ వ్యవస్థ అధ్వానంగా మారడంతో గత ఖరీఫ్‌లో భారీ వర్షాలు, మోంథా తుపాను వల్ల జిల్లాలో సుమారు 77,560 ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల నీట మునిగాయి. పది మేజర్‌ డ్రెయిన్ల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా. 

సకాలంలో తూడు, గురప్రుడెక్క తొలగించకపోవడంతో చేలను ముంపునీరు వీడడం లేదు. ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన రూ.రెండు కోట్ల నిధులు కూడా టీడీపీ ఏలుబడిలో ఉన్న గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ ఖర్చు చేయలేదు. ఈ పాపం రైతులకు శాపంగా మారింది. తాజాగా రబీలో శివారుకు నీరందడం లేదు. కోనసీమ జిల్లాలో అల్లవరం, మలికిపురం, మామిడికుదురు, కె.గంగవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాజులూరు, కరప వంటి శివారుకు సాగునీరు అందక చేలు బీడు వారుతున్నాయి.  

కాగితాలకే పరిమితం 
చంద్రబాబు ప్రభుత్వంలో బడ్జెట్‌ కేటాయింపులన్నీ కాగితాల మీదే కనిపిస్తున్నాయి. డెల్టాకు రూ.200 కోట్లు కేటాయించినట్లు చూపించారు. కానీ వాస్తవంగా ఏటా రూ.ఐదు కోట్లు మించి కూడా ఖర్చు పెట్టడం లేదు. ఈ బడ్జెట్‌ వల్ల రైతులకు నేరుగా కలిగిన లాభం లేదు. కనీసం డెల్టాలో పంట, మురుగునీటి కాలువల ఆధునీకరణకు నిధులు ఎక్కువగా ఇచ్చి ఖర్చు పెట్టి ఉంటే మేలు జరిగేది. అలా కూడా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేదు.  – విప్పర్తి వేణుగోపాలరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్, రిటైర్డ్‌ ఎస్‌ఈ ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌.  

చిన్న మరమ్మతులకే రూ.70 కోట్లు 
గోదావరి కాలువలపై షట్టర్ల మరమ్మతులు చేయడం, లాకుల మీద గ్రీజులు పెట్టడం, పంట కాలువ లైనింగ్‌ పనులు, పంట కాలువలు, చానల్స్‌లలో పూడిక తొలగింపు, మురుగునీటి కాలువలపై తూడు తొలగింపు వంటి చిన్న చిన్న పనులకే రూ.70 కోట్ల వరకు అవసరం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంట కాలువ వ్యవస్థ అధ్వానంగా మారడం వల్ల రైతులు ఏటా రూ.కోట్లలో పంటను నష్టపోతున్నారు. ఇప్పుడు ఇస్తున్న నిధులలో రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదు.    – కొవ్వూరి త్రినా«థ్‌రెడ్డి, రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, రామచంద్రపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement