
సాక్షి, హైదరాబాద్: గత నాలుగున్నరేళ్లలో ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా రూ.2,160 కోట్లు ఆదాయం లభించిందని, 2018 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు రూ.610 కోట్ల ఆదాయం లభించిందని ఆ సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో నిక్షిప్తమై ఉన్న నూతన ఖనిజాలను వెలికి తీసి ఆదాయం సమకూర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రాష్ట్రాలకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, గనులశాఖ డైరెక్టర్ సుశీల్కుమార్, టీఎస్ ఎండీసీ డైరెక్టర్ మల్సూర్, పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ కిరణ్కుమార్ పాల్గొన్నారు.