
ముఖ్యమంత్రి గారూ..కవితపై చర్యలు తీసుకుంటారా..?
‘‘అవినీతిపరులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రయత్నిస్తున్నారు
కొత్తగూడెం రూరల్: ‘‘అవినీతిపరులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రయత్నిస్తున్నారు. చట్టరీత్యా ఇది కూడా నేరమే. అందుకే, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం గారు ప్రకటించాలి’’ అని, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం కొత్తగూడెం లోని సింగరేణి ట్రాన్సిట్ అతిధి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘మీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగిస్తామంటూ 40వేల మంది సింగరేణి కార్మికుల నుంచి చందాల రూపంలో దాదాపు 90లక్షల రూపాయలను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షుడు కనకరాజు, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, నాయకుడు సారంగపాణి వసూలు చేసి, తమ వ్యకిగత ఖాతాలలో జమ చేసుకున్నారు.
వీరు డబ్బులు తీసుకున్నట్టు రుజువవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని అన్నారు. అరుునప్పటికీ ఆ ముగ్గురిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘వారిని అరెస్టు చేయవద్దంటూ పోలీసులపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత ఒత్తిడి తెస్తున్నట్టుగా కార్మికులు మాకు సమాచారమిచ్చారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అవినీతిపరులను కాపాడుతున్న తన కూతురు కవితపై ఎటువంటి చర్యలు తీసుకునేదీ ఆయన శాసనసభలో వెల్లడించాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘అవినీతిపరులను అరెస్టు చేయవద్దంటూ పోలీసులపై ఆమె ఒత్తిడి తీసుకొస్తే.. ఆమె కూడా తప్పు చేసినట్టే అవుతుంది. చట్టరీత్యా అది నేరమవుతుంది’’ అని అన్నారు. కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని; చందాలు వసూలు చేసిన కనకరాజు, రాజిరెడ్డి, సారంగపాణిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్టరుుతే.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్మికులు, ఎంఆర్పీఎస్ ఐక్యంగా పెద్దఎతున ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు నల్లమోతు విజయరాజు, ఇనిగాల మొగిలి, దాసరి శ్రీనివాస్, దాసరి సారధి, కొండకూరి అశోక్, కొప్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకుందాం
పాల్వంచ: ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకునేంత వరకు ఉద్యమించేందుకు మాదిగలు సిద్ధంగా ఉండాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ కొత్తగూడెం నియోజకవర్గ సదస్సు ఆదివారం రాత్రి స్థానిక బస్టాండ్ సెంటర్లోని మినీ గెస్ట్హౌజ్ ప్రాంగణంలో జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఒక్క మాల, మాదిగల కోసమే కాదని.. 54 ఉప కులాల అభివృద్ధి చెందాలన్నది కూడా దీని లక్ష్యమని అన్నారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధాని మోడి, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు మాట ఇచ్చారని అన్నారు. అరుునప్పటికీ, చట్టబద్ధత కల్పించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో వారు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ విషయంలో మాలలు మరో రకంగా చూడొద్దు. అవకాశాలను అన్నదమ్ముల్లా పంచుకుందాం’’ అని అన్నారు. ఎంఆర్పీఎస్ను బలహీనపరచడమే లక్ష్యంగా కొందరు స్వార్ధపరులు, దళారుల ద్వారా వ్యతిరేక ఉద్యమాలకు కేసీఆర్ ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.