పుట్టినరోజే మృత్యువాత  | Sakshi
Sakshi News home page

పుట్టినరోజే మృత్యువాత 

Published Mon, Aug 12 2019 3:31 AM

Hyderabad student dies after falling into river in Ukraine - Sakshi

హైదరాబాద్‌: ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఉక్రెయిన్‌ వెళ్లాడు.. అది పూర్తి చేసుకుని తిరిగి రావడానికి టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాడు.. మరికొద్ది గంటల్లో విమానం ఎక్కి ఇంటికి రానున్న తరుణంలో విధి వక్రీకరించింది. పుట్టినరోజునాడే ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాగ్యనగర్‌కాలనీకి చెందిన రాజేందర్‌సింగ్‌ భాటియా, జస్‌ప్రీత్‌ కౌర్‌ల కుమారుడు జస్‌ప్రీత్‌సింగ్‌ భాటియా (21) ముంబైలోని అమిటీ కళాశాలలో బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల 40 రోజుల ఇంటర్న్‌షిప్ కోసం ఉక్రెయిన్‌ వెళ్లాడు. శనివారం అది పూర్తి కావడంతో హైదరాబాద్‌ వచ్చేందుకు టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాడు.

కొద్ది గంటల్లో నగరానికి బయలుదేరాల్సి ఉండగా.. పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి ఉక్రెయిన్‌లోని ఫియో ఫానియా పార్క్‌ నది వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు జస్‌ప్రీత్‌ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు విషాదంలో మునిగిపోయారు. కాగా, జస్‌ప్రీత్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చర్యలు చేపట్టారని తెలంగాణ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఖమ్రుద్దీన్, వైస్‌ చైర్మన్‌ శంకర్‌లూక్‌ తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ అధికారులతో ఆయన మాట్లాడారని వెల్లడించారు. జస్‌ప్రీత్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచి్చనట్టు చెప్పారు.  

Advertisement
Advertisement