ఏకగ్రీవం కావాలి! | On the gram panchayat election TRS targeted | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవం కావాలి!

Jan 3 2019 2:24 AM | Updated on Jan 3 2019 4:53 AM

On the gram panchayat election TRS targeted - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలిచేలా వ్యూహం రచిస్తోంది. వీలైనన్ని ఎక్కు వ గ్రామపంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఏకగ్రీవమయ్యే గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా ఉండేలా వ్యూహం అమ లు చేస్తోంది. గ్రామస్థాయిలోని శ్రేణులకు అవకాశాలు కల్పించే ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశించింది. గ్రామాలవారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహించి వీలైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నికలయ్యేలా చూడాలనీ, వీలుకాని పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలిచేలా వ్యూహం అమలు చేయాలని స్పష్టం చేసింది.

టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పంచాయతీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసినవారిని గుర్తించి అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామాల్లో మంచి పేరున్న వారిని ఎంపిక చేసి ఏకగ్రీవమయ్యేందుకు చర్చలు జరుపుతున్నారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగిన గ్రామపంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తంతోపాటు తమ అభివృద్ధి నిధుల నుంచి మరో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపి క అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. పార్టీ తరఫున ఒకరి పేరు చెప్పినా సొంత పార్టీలోని వారి నుంచే మరికొందరు బరిలో ఉండే పరిస్థితి ఉంది. పోటీపడే వారు ఎక్కువగా ఉండడంతో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

కేటీఆర్‌ తొలి టాస్క్‌...
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కె.తారకరామారావు నియమితులైన తర్వాత తొలి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుం టోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన తర్వాత జరిగిన టీఆర్‌ఎస్‌ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్‌ పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా ప్రస్తావించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షలు గ్రాంట్‌ వస్తుంది. వీలైనన్ని గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలి’అని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గబాధ్యులను దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులు, ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల విజయం కోసం వ్యూహం మొదలుపెట్టారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు మండలాలవారీగా కసరత్తు ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement