11 తర్వాత మహిళలకు మంచి రోజులే 

Gaddar And Kushboo Campaign In Adilabad - Sakshi

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

ఆదిలాబాద్‌ రోడ్‌షోలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ ఖుష్బూ

ఆదిలాబాద్‌అర్బన్‌: ఆదిలాబాద్‌లోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మేజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ ఖుష్బూ పిలుపునిచ్చారు. ఈ నెల 11 తర్వాత అధికారంలోకి కాంగ్రెసే వస్తుందని, ఇక మహిళలకు అన్ని మంచి రోజులేనని చెప్పారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్, కాంగ్రెస్‌ అభ్యర్థి సుజాత, నాయకులతో కలిసి ఆదిలాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి గాంధీపార్కు, కలెక్టర్‌ చౌక్‌ మీదుగా తెలంగాణ చౌక్, డైట్‌ మైదానం వరకు రోడ్‌షో సాగింది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్‌లో ఖుష్బూ మాట్లాడారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే మహిళలకు రక్షణ ఉంటుందని, పది స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రంలో మహిళా కమిషన్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ హయంలోనే సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపులు వచ్చాయని తెలిపారు.
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మహిళా గ్రూపులకు రూ.10 లక్షలు వడ్డీ లేకుండా ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి ఆరు వంట గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ ఇంత వరకు ఎందుకు వేయలేదని, మీకేవరికైనా వచ్చాయా.. అని ఓటర్లను ప్రశ్నించారు. సీనియర్‌ నాయకులు రాంచంద్రారెడ్డి ఆశీర్వాదం కావాలని, మీరు సహకరిస్తే తప్పకుండా సుజాత విజయం సాధిస్తుందని అన్నారు. అనంతరం ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే గండ్రత్‌ సుజాతకు మంత్రి పదవి ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. రోడ్‌షోలో కాంగ్రెస్‌ మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, నాయకులు నరేష్‌ జాదవ్, భార్గవ్‌ దేశ్‌పాండే, సాజీద్‌ఖాన్, భూమారెడ్డి, రూపేష్‌రెడ్డి, శకీల్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top