పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు  | Exercise for transfers in Police Department | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు 

Jul 17 2019 1:33 AM | Updated on Jul 17 2019 1:33 AM

Exercise for transfers in Police Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖలో కిందిస్థాయి సిబ్బందిపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలికంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి.  ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు దాటిన కానిస్టేబుల్, నాలుగేళ్లు దాటిన హెడ్‌కానిస్టేబుల్, మూ డేళ్లు దాటిన ఏఎస్సైల వివరాలను పంపాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. కిందిస్థాయి సిబ్బంది బదిలీలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. 

సార్సాల ఘటన తర్వాత మారిన సీన్‌.. 
ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాల గ్రామంలో ఫారెస్ట్‌ అధికారిపై దాడి జరిగిన తర్వాత డీజీపీ మహేందర్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. అది మొదలు రాష్ట్రంలో డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రతి అంశంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై విమ ర్శలు రావడంతో డీజీపీ తీవ్రంగా స్పందించారు. వెంటనే అన్ని జిల్లాల ఎస్పీ లు, కమిషనర్లకు సందే శాలు పంపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ఎలాంటి విమర్శలు రావొద్దని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో పంజగుట్ట పోలీస్‌ ఠాణా ఎదుట ఇటీవల స్వల్ప వ్యవధిలో రెండు హత్యలు జరగడంతో డీజీపీ ఠాణాను అర్ధరాత్రి సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురిపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ పరిసరాలు మురికిగా ఉండటం, డ్యూటీ సమయంలో సిబ్బంది ఏమరుపాటుపై మండిపడ్డారు.  

గ్రేటర్‌ తర్వాత జిల్లాల్లో.. 
తొలుతగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల సందర్శనకు డీజీపీ శ్రీకారం చుట్టారు. పలు జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. దీంతో బదిలీ కాకుండా మిగిలిపోయిన ప్రాంతాల్లో ఈ జాబితాను రూపొందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల్లోనూ డీజీపీ పర్యటన ఉంటుందని సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement