31 జిల్లాల్లో ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాలు 

EAMCET Helpline Centers in 31 Districts - Sakshi

8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో భాగంగా 31 జిల్లాల్లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో 10 జిల్లాల్లో 21 హెల్ప్‌లైన్‌ కేంద్రాలు మాత్రమే ఉండేవని తాజాగా వీటిని పెంచినట్లు వెల్లడించారు. మూడు దశల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని, క్యాంపు కార్యాలయ ఆధ్వర్యంలోనే ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ఉంటుందని అన్నారు. గతంలో క్యాంపు కార్యాలయం కేటాయించిన బ్రాంచీలో చేరి, ఆ తర్వాత ఇతర బ్రాంచీలోకి మారితే విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చేది కాదని, ప్రస్తుతం క్యాంపు కార్యాలయమే ఆ పని చేయడం వల్ల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని వివరించారు.

మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని తెలిపారు. జూన్‌ 31 లోగా ప్రవేశాలను పూర్తి చేసి, జూలై 2 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈసారి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు, ఎంసెట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు లింకు పెడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థి ఇంజనీరింగ్‌లో సీటు కావాలనుకుంటే డిగ్రీలో అతనికి వచ్చిన సీటు ఆటోమెటిగ్గా రద్దు అయ్యేలా, డిగ్రీలో సీటు కావాలనుకుంటే ఇంజనీరింగ్‌లో వచ్చిన సీటు రద్దు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈసారి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గతంలో కంటే అదనంగా 25 శాతం సీట్లు భర్తీ అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు లేని కోర్సులను మాత్రమే రద్దు చేస్తున్నామని, విద్యార్థులు ఉంటే ఏ మీడియం అయినా కొనసాగిస్తామని అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top