ఆన్‌లైన్‌లో ‘డిగ్రీ’ పాఠాలు

Degree college Classes In Online At Karimnagar - Sakshi

అత్యాధునిక సాంకేతికతతో వర్చువల్‌ తరగతులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు

రాష్ట్రమంతటా ఒకేసారి పాఠాలు

సాక్షి, కరీంనగర్‌: ఇక నుంచి డిగ్రీ పాఠాలు ఆన్‌లైన్‌లో వినవచ్చు. టీ–సాట్‌ ద్వారా పాఠాలు, టీఎస్‌కేసీ, మూక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులకు నూతన టెక్నాలజీతో డిజి టల్‌ పాఠాలను ప్రస్తుతం బోధిస్తున్నారు. మరో అధునాతన సాంతకేక విప్లవం ప్రభుత్వ డిగ్రీ విద్యలో అందుబాటులోకి వచ్చింది. సరికొత్తగా వర్చువల్‌ క్లాస్‌ రూం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు ఒకేసారి పాఠ్యాంశాలు వినే విధంగా రూపొందించి మరింత సులభతరంగా పాఠాలు బోధించే పద్ధతికి శ్రీకారం చుట్టారు.

ఆగస్టు 31న ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ చేతుల మీదుగా వర్చువల్‌ క్లాస్‌లు ప్రారంభించారు. వివిధ కోర్సులకు సంబం ధించిన విద్యార్థులకు కావాల్సిన పాఠ్యాంశాలు అధ్యాపకులు ఉన్న చోట నుంచి విద్యార్థులు ఉండి అధ్యాపకులు లేని చోట వర్చువల్‌ క్లాస్‌లను ఉపయోగించుకునేందుకు దీనిని మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 37 కళాశాలల్లో వినియోగంలోకి రానుండగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 కళాశాలల్లో అమలు కానుంది. రుసా(రాష్ట్రీయ ఉచ్చాతార్‌ శిక్షా అభియాన్‌) కేంద్ర నిధులతో వర్చువల్‌క్లాస్‌ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు ఒక్కో కళాశాలకు దాదాపు రూ.6 లక్షల రూల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం.

వివిధ సబ్జెక్టుల పాఠశాలు...
వర్చువల్‌ క్లాస్‌ ద్వారా ముఖ్యంగా పలు సబ్జెక్టుల కోసం రూపొందించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జియాలజీ, సైకాలజీ, కంప్యూటర్‌సైన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, సోసియాలజీ, జర్నలిజంతోపాటు వివిధ సబ్జెక్టుల పాఠాలు ఆన్‌లైన్‌లో బోధించడానికి వర్చువల్‌ క్లాస్‌ రూంలు ఉపయోగించనున్నారు. ఇదే కాకుండా అందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన చిత్రాలు. ముఖ్యమైన గ్రాఫ్‌లు కూడా అందులో నిక్షిప్తం చేశారని తెలిసింది. కొన్ని సబ్జెక్టుల్లో బొమ్మలు వేయడానికే సమయం అంతా వృథా అయిపోతుంది.

కాబట్టి అందులో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పాఠ్యాంశాలు బోధిస్తే సమయం ఆదాతోపాటు సులభతరంగా అర్థమవుతుంది. ఒక వేళ రెండు పిరియడ్‌లు ఒకే సబ్జెక్టు బోధించాలంటే ఒక పిరియడ్‌ బోధన రికార్డు చేసుకొని మరో పిరియడ్‌ అదే ప్లే చేసుకునేలా వెసులుబాటు ఉంది. కావాల్సిన పాఠాన్ని రికార్డు చేసుకొని ఎన్నిసార్లయిన వినవచ్చు. కేవలం బోధనే కాకుండా విద్యార్థులు సందేహాలను సైతం నివృత్తి చేసుకునే విధంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో వాడే టెక్నాలజీ గ్రామీణ ప్రాంత విద్యార్థులుండే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వాడడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా గల కళాశాలల విద్యార్థులు విజ్ఞానాన్ని అందుకోవచ్చు.

7 కళాశాలల్లో అమలు...
రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్‌ తరగతులు 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జరుగనుండగా ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 7 కళాశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ  కళాశాల, ప్రభుత్వ ఉమెన్స్‌ కళాశాల, జగిత్యాలలోని ఎస్‌కెఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్చువల్‌ క్లాస్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 
వర్చువల్‌ తరగతుల వల్ల ఉపయోగాలు

  • ఒకే వద్ద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గల కళాశాలల్లో తరగతులు వినవచ్చు.
  • అధ్యాపకులు లేని కళాశాల విద్యార్థులకు ఉపయోగం.
  • బోధనతోపాటు విద్యార్థులు సందేహాలు కూడా అడగవచ్చు.
  • పాఠ్యాంశాల బోధన రికార్డు చేసుకోవచ్చు.
  • నోట్స్‌ను స్కాన్‌ చేసి రాష్ట్రమంతటా షేర్‌ చేసుకోవచ్చు.
  • అన్ని సబ్జెక్టుల చిత్రాలు నిక్షిప్తం అయిఉంటాయి.
  • విద్యార్థులు తరగతికి రాకున్నా యాప్‌ ద్వారా మొబైల్‌కు కనెక్టు చేసుకొని తరగతులు వినవచ్చు.–మెసైజ్‌ క్లౌడ్‌ యాప్‌ ద్వారా విద్యార్థి మొబైల్‌లో చూడవచ్చు.
  • లెక్చరర్లు లేని కోర్సుల్లో కూడా ప్రవేశాలు పెరుగుతాయి.
  • విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు అందుబాటులో ఉండడంతోపాటు మరెన్నో సదుపాయాలున్నాయి.

విద్యార్థులు సాంకేతికతను వినియోగించుకోవాలి
విద్యార్థులకు వర్చువల్‌ క్లాస్‌రూం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న వర్చువల్‌ తరగతులు వినియోగించుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ఎదుగుతున్న సందర్భంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విజ్ఞాన సముపార్జన, విస్తృత అధ్యయనం జరుగుతుంది.
– డాక్టర్‌ కలవకుంట రామకృష్ణ, ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top