'టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుదాం' | Congress leaders call to win in MLC elections | Sakshi
Sakshi News home page

'టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుదాం'

Feb 26 2015 3:20 AM | Updated on Mar 22 2019 6:24 PM

'టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుదాం' - Sakshi

'టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుదాం'

ఆచరణ సాధ్యంకాని హామీలు, మాటలతో మభ్యపెడుతున్న టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ శ్రేణులకు నేతల పిలుపు
 సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యంకాని హామీలు, మాటలతో మభ్యపెడుతున్న టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బుధవారం గాంధీభవన్‌లో ఆయన బి-ఫారాలను జారీ చేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు షబ్బీర్ అలీ సమక్షంలో అభ్యర్థులు  బి-ఫారాలను అందుకున్నారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్నను, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి రవికుమార్ గుప్తాను పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరు గురువారం నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ అధికార టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు.
 
 కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన ఆ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేవిధంగా కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, వక్ఫ్‌భూములపై ఏర్పాటైన శాసనసభా సంఘం తొలి సమావేశంలో పాల్గొన్న షబ్బీర్ అలీ.. సర్కారు తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కబ్జాలైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించి బడాబాబులకు ప్రభుత్వం మేలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, టి. జీవన్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత మొక్కుల కోసం ప్రజా సొమ్మును ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని అరుణ వ్యాఖ్యానించారు. తన కోరికలు తీరితే పక్కవాడి తలనీలాలు ఇచ్చినట్టుగా సీఎం వ్యవహారం ఉందని ఆమె అన్నారు. ఇక కేజీ నుంచి పీజీ విద్యపై ప్రభుత్వానికి స్పష్టత లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లబోధన లేకుండా, మధ్యలో ప్రవేశపెడితే ఆచరణలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ హామీ మేరకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement