అనుమతి లేకుంటే ఉపేక్షించొద్దు | Collector Says Dont Ignore If No Tender Permissions For Sand | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుంటే ఉపేక్షించొద్దు

Mar 25 2018 10:43 AM | Updated on Feb 17 2020 5:11 PM

Collector Says Dont Ignore If No Tender Permissions For Sand - Sakshi

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : జిల్లాలో అనుమతి లేకుండా మొరం, కంకరను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ తన చాంబర్‌లో జిల్లాస్థాయి పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో అక్రమంగా మొరం, కంకరను తరలిస్తే వారిపై నిఘా పెట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కంకర క్వారీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జాప్యం లేకుండా అనుమతులివ్వాలన్నారు. దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత శాఖల నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ పొంది, శాఖాపరంగా సర్వే చేసి అనుమతులు జారీ చేయాలన్నారు. జిల్లాలో సర్వేయర్లు లేని పక్షంలో ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై తెప్పించుకుని సర్వేను పూర్తి చేయాలని సూచించారు. క్వారీల రెన్యూవల్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి కూడా నిర్ణీత కాల వ్యవధిలోగా అనుమతులు జారీ చేయాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ ప్రసాద్, ఆర్‌డీఓ వినోద్‌ కుమార్, భూగర్భ గనులశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి...
ఈ నెల 26న శ్రీరామ నవమి, 31న జరిగే హనుమాన్‌ జయంతి ఉత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని, ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లతో పాటు తాగునీటి వసతి, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అలాగే దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమయ్య, తదితరులున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement