సాక్షి, నారాయణపేట: జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కేసుల గురించి విసృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ రోజు (శుక్రవారం) నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులం అనే విద్వేషాన్ని రూపుమాపాలని ఎస్సీ,ఎస్టీ కేసులపై అవగాహన కల్పించి కేసులకు అవకాశం లేకుండా చూడాలని సూచించారు.
మంత్రి మాట్లాడుతూ.. చనిపోయిన తర్వాత వచ్చే నష్ట పరిహారం కంటే బతికి ఉన్నప్పుడు ఉండే భరోసా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. జిల్లాలో ప్రజలకు చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. కులం విషయంలో అవమాన పడ్డ వ్యక్తిగా తాను కుల విద్వేషాలను వ్యతిరేకిస్తున్నాను. విద్యా వ్యవస్థలో మరింతగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు..
జిల్లాలో ఇంకా బహిర్భూమికి వెళ్ళే పరిస్థితి పోవాలని ,అందరికీ మరుగుదొడ్లు మంజూరు చేయించాలని కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో అన్ని గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. గిరిజన తండాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ను, 25 ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
జిల్లాలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న సివిల్ రైట్ డే, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉల్లాస్ కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు .. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


