గెలాక్సీ ఎస్8 తయారీ ఖర్చెంతో తెలుసా? | Samsung Galaxy S8's manufacturing cost revealed | Sakshi
Sakshi News home page

గెలాక్సీ ఎస్8 తయారీ ఖర్చెంతో తెలుసా?

Apr 22 2017 12:39 PM | Updated on Oct 9 2018 4:06 PM

గెలాక్సీ ఎస్8 తయారీ ఖర్చెంతో తెలుసా? - Sakshi

గెలాక్సీ ఎస్8 తయారీ ఖర్చెంతో తెలుసా?

గెలాక్సీ ఎస్8 రూపొందడానికి అసలు ఖర్చెంత అయిందో వెల్లడిస్తూ ఐహెచ్ఎస్ మార్కిట్ ఓ రిపోర్టు విడుదల చేసింది.

న్యూఢిల్లీ : శాంసంగ్ గెలాక్సీ ఎస్8.. ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లలోకి విడుదలైంది. గెలాక్సీ నోట్7 పేలుళ్ల అనంతరం ఎంతో సురక్షితమైన ఫోన్గా ఈ దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ ఎస్8ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.57,900గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇది గెలాక్సీ ఎస్8 అసలు ధర కాదంట. కంపెనీలు మార్కెట్లోకి ఏ ప్రొడక్ట్ను ప్రవేశపెడుతున్నా దానిపై కొంత లాభాలను, ఇతర వ్యయాలను కలుపుకుని ధరను నిర్ణయిస్తాయి. శాంసంగ్ కూడా అలానే గెలాక్సీ ఎస్8ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే గెలాక్సీ ఎస్8 రూపొందడానికి అసలు ఖర్చెంత అయిందో వెల్లడిస్తూ ఐహెచ్ఎస్ మార్కిట్ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ 64 స్టోరేజ్ వేరియంట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్(బీఓఎస్)లకు కంపెనీ సుమారు 19,500 రూపాయల వరకు ఖర్చు చేసిందట. 
 
తయారీ ఖర్చు సుమారు 392 రూపాయలని, మొత్తంగా ఈ ఖర్చు 19,900 రూపాయల వరకు అయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదించింది.  ఈ ఖర్చు శాంసంగ్ గెలాక్సీ ఎస్7 తయారీ ఖర్చు కంటే 2,800 రూపాయలు ఎక్కువని తెలిపింది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఖర్చు కూడా దీని కంటే 2,300 తక్కువేనని వెల్లడైంది.  అయితే ఒక్కో కాంపొనెంట్ ధరను ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించనప్పటికీ, ఎన్ఏఎన్డీ ఫ్లాష్ మెమరీ, డీఏఆర్ఎమ్ ధర సుమారు 2,700 అయి ఉంటుందని, బ్యాటరీ ధర 291 రూపాయలు ఉంటుందని తెలిపింది.

 గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ధరలు కంపెనీ ఎలా నిర్ణయించిందో రివీల్ కానప్పటికీ, గెలాక్సీ నోట్7ను కచ్చితంగా మేజర్ అంశంగా కంపెనీ భావించినట్టు తెలిసింది. కంపెనీ చౌక వెర్షన్ను 46,548 రూపాయలకు విక్రయిస్తుంది. ఈ ధర తయారీ ఖర్చు కంటే సుమారు 26,700 రూపాయలు ఎక్కువని రిపోర్టు వెల్లడించింది. అయితే ఇవన్నీ కంపెనీకి వచ్చే లాభాలని మాత్రం ఊహించవద్దంట. ఎందుకంటే మిగతా ఖర్చులు మార్కెటింగ్ వ్యయాలు, పన్నులు, రిటైలర్, క్యారియర్ ఖర్చులు వంటి వాటిని కలుపుకుంటే ఒక్కో యూనిట్పై కంపెనీ భరించేది ఎక్కువే ఉంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement