‘స్మార్ట్’ అయ్యారు | internet use in India and the development | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’ అయ్యారు

May 12 2014 10:56 PM | Updated on Jul 26 2018 5:21 PM

దేశంలో ఇంటర్నెట్‌ని అధికంగా వినియోగిస్తున్నవారిలో నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఉదయం ఫ్రెండ్స్‌ని వాట్స్ అప్ అని పలకరింపుతో మొదలైన నెట్ ఉపయోగం..

 న్యూఢిల్లీ:దేశంలో ఇంటర్నెట్‌ని అధికంగా వినియోగిస్తున్నవారిలో నగరాల్లో ఢిల్లీ ఒకటి.  ఉదయం ఫ్రెండ్స్‌ని వాట్స్ అప్ అని పలకరింపుతో మొదలైన నెట్ ఉపయోగం.. ఫేస్‌బుక్‌లో ఫొటోలకు లైక్‌కొట్టి...ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేస్తూ.. ఊపందుకుంటుంది. ఎక్కడైనా కాస్త సమయం దొరికినా యూట్యూబ్‌లోకి వెళ్లిపోతున్నారు. సరదా ప్రోగ్రామ్‌లు... సినిమా ట్రైలర్స్ చూస్తూ గడిపేస్తున్నారు.  టీవీ చానళ్లలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలను సైతం మొబైల్‌లోనే వీక్షిస్తున్నారు. పెళ్లి.. ప్రయాణాలు... కార్యాలయాలు.. బస్‌స్టాప్‌లు.. ఆస్పత్రులు.. సినిమా క్యూలైన్లలోనూ తలవంచుకుని ఫోన్ తెరలో మునిగిపోతున్నారు.
 
 స్క్రీన్ పైనే సెలక్షన్..
 ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అనేక వెబ్‌సైట్లు షాప్‌లలో ధరకంటే తక్కువకే వస్తువులను, దుస్తులను అందిస్తుం డడంతో సిటిజనులు చాలామంది నెట్‌షాపింగ్‌కే మొగ్గుచూపుతున్నారు.అంతేకాకుండా సమయం ఆదా అవుతుండడం కూడా దీనికి మరో ప్లస్‌పాయింట్. ఇంకేముంది కుటుంబసమేతంగా మొబైల్ ముందు కూర్చొని స్క్రీన్‌పైనే నచ్చిన దుస్తులు, వస్తువుల సెలక్షన్ పూర్తిచేస్తున్నారు. ఇంటిలో వస్తువులను అమ్మేయడానికి కూడా స్మార్ట్‌ఫోన్లు వినియోగించేవారి సంఖ్య పెరుగుతోంది.
 
 క్లిక్‌తోనే ఇంటికి భోజనం..
 నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, పిజ్జా సెంటర్లు తమ వెబ్‌సైట్లలో మెనూను ఉంచుతున్నాయి. చిత్రాలను చూసి నచ్చిన వాటిని క్లిక్ చేస్తే అర్ధగంటలో ఇంటికి పార్సిల్ భోజనం వచ్చేస్తోంది. బిజీగా ఉండే వ్యాపారులు తమ మొబైల్ ద్వారా మంచి డిష్‌ను ఆర్డర్  చేసి తెప్పించుకుని రుచి చూస్తున్నారు.  
 
 తల్లిదండ్రుల ఆందోళన..
 మొబైల్ ఇంటర్నెట్‌తో ఎన్నో ఉపయోగాలున్నా.. కొందరు తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్లను పట్టుకుని కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం చేసే సమయంలోనూ మొబైల్‌తోనే గడుపుతున్నారని తెలిపారు. బంధువుల మధ్యే కాదు.. కుటుంబసభ్యుల మధ్య కూడా వారికి మాట్లాడే సమయం లేకుండా పోతుందని వెళ్లగక్కారు.
 
 తగ్గిన సందడి..
 మొబైల్ ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో.. కేఫ్‌ల వద్ద సందడి క్రమేణా తగ్గుతోంది. గేమ్‌లు ఆడుకునే పిల్లలు.. సర్టిఫికెట్లను స్కానింగ్ చేసుకునే విద్యార్థులు.. నెట్‌ఫోన్‌లో మాట్లాడేవారితోనే కేఫ్ నిర్వాహకులు నెట్టుకొస్తున్నారు.
 
 సంబంధాలు దెబ్బతింటున్నాయి..
 ఇంటర్నెట్ లాభాల గురించి, సమయం ఆదా గురిం చే అందరూ మాట్లాడుతున్నారు కాని.. నష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని సామాజిక నిపుణులు అంటున్నారు. నెట్ మోజులో పడి మానవ సంబంధాలను మర్చిపోతున్నారు. భోజనం చేసేటప్పుటు కూడా ఓవైపు టీవీ రిమోటు.. మరోవైపు  స్మార్ట్‌ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారని విమర్శిస్తున్నారు. కనీసం మంచి చెడు, సరదా కబుర్లకు కూడా ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే పరిణామమని, ఈ ధోరణిలో మార్పురావాలని సూచిస్తున్నారు.
 
 సమాచార సేకరణ: అన్విత, డిగ్రీ విద్యార్థిని
 ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్ల విప్లవంతో కేఫ్‌లకు వెళ్లడం లేదు కాని ఏడాది క్రితం వరకు కేఫ్‌లు దేవుడిచ్చిన వరంలా కనిపించేవి.  కాస్త ఖాళీ దొరికినా కేఫ్‌లో దూరిపోయి పోటీ పరీక్షలకు సంబంధించి సమాచారం సేకరించేదాన్ని. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ద్యారా నే ఇంటర్నెట్ వాడుతున్నాను. చాటింగ్, ఫేస్‌బుక్ మాత్రమే కాకుండా పలు కాలేజీలు, యూనివర్సిటీల కు సంబంధించిన సమాచార సేకరణ, కొత్త సిని మాలు, కొత్త పాటలు, రాజకీయాలు, పోటీపరీక్షల గురించి నెట్ ద్వారానే తెలుసుకుంటున్నాను.
 

Advertisement
 
Advertisement
Advertisement