అధిష్టానాన్ని కలవనున్న రాష్ట్ర బీజేపీ నేతలు | BJP leaders to meet party's central leadership over Vidarbha | Sakshi
Sakshi News home page

అధిష్టానాన్ని కలవనున్న రాష్ట్ర బీజేపీ నేతలు

Aug 5 2013 10:48 PM | Updated on Mar 28 2019 8:37 PM

ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు.

ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుతోపాటు దీనినికూడా చేర్చాలంటూ ఒత్తిడి తెచ్చేందుకుగాను మంగళవారం దేశరాజధానికి చేరుకుని అధిష్టానాన్ని కలవనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలోని పార్టీ అధిష్టానాన్ని మంగళవారం కలవాలని నిర్ణయించాం. ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని ఒత్తిడి చేస్తాం. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ఉన్న మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలుస్తాం’ అని అన్నారు.
 
 కాగా ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ప్రత్యేక విదర్భ రాష్ట్ర వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. 1992లో భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు అనుగుణంగా ఓ తీర్మానం ఆమోదించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement