రంగంలోకి ఏసీబీ | ACB Focus on Public Works Department | Sakshi
Sakshi News home page

రంగంలోకి ఏసీబీ

Jun 1 2015 4:53 AM | Updated on Aug 17 2018 12:56 PM

ప్రజా పనుల శాఖలో అవినీతి భాగోతంపై ఏసీబీ దృష్టి కేంద్రీకరించింది. పలు బృందాలుగా ఏసీబీ అధికారులు ప్రజా పనుల శాఖకు సంబంధించిన

సాక్షి, చెన్నై : ప్రజా పనుల శాఖలో అవినీతి భాగోతంపై ఏసీబీ దృష్టి కేంద్రీకరించింది. పలు బృందాలుగా ఏసీబీ అధికారులు ప్రజా పనుల శాఖకు సంబంధించిన డివిజన్ కార్యాలయాల్లో తనిఖీల్లో నిమగ్నమైనట్టు వెలుగు చూసింది. అధికారుల వద్ద విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ప్రజాపనుల శాఖలో అవినీతి తిమింగళాలు అం టూ గత నెల సచివాలయం ఆవరణలో వెలిసిన ఓ ఫ్లెక్సీ అధికార వర్గాల్లో కలకలం రేపింది. తొలి విడతగా హెచ్చరిక, మలి విడతగా అవినీతి అధికారులు బండా రం బయట పెడుతూ, వారి ఫొటోలు, పేర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒప్పందదారులు, కాంట్రాక్టర్లు అధికారులపై తీవ్ర ఆరోపణల్ని సంధించారు. అయినా ఫలితం శూన్యం. శాఖాపరంగా ఎలాంటి చర్యలు లేవు. తాజాగా ఐదో సారిగా సీఎం పగ్గాలు చేపట్టిన జయలలిత ఆరోపణలపై దృష్టి పెట్టినట్టు సమాచా రం. ఏయే అధికారులపై ఆరోపణలు వచ్చాయో వారి భరతం పట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా అవినీతి నిగ్గు తేల్చేందుకు ఏసీబీని రంగంలోకి దించినట్టున్నారు.
 
 రంగంలోకి ఏసీబీ
 కాంట్రాక్టర్లు, ఒప్పంద దారులు తమ మీద బురద జల్లుతున్నారని, ఫ్లెక్సీల రూపంలో తమ పరువును బజారుకీడుస్తున్నారని పలువురు ఐఏఎస్ అధికారులు చెన్నై పోలీసు కమిషనర్‌కు శనివారం విన్నవించిన విష యం తెలిసిందే. అలా... అధికారులు తమ పరువు కాపాడుకునే రీతిలో పోలీసుల్ని ఆశ్రయిస్తే, ఇలా ఒప్పం దదారులు, కాంట్రాక్టర్లు ప్రకటించిన మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది అధికారులపై ఏసీబీ గురి పెట్టడం చర్చనీయాంశమైంది. ఆయా అధికారుల కార్యాలయాల్లో శనివారం నుంచి ఏసీబీ వర్గా లు తనిఖీలు సాగిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, ప్రజా పనుల శాఖకు సంబంధించిన డివిజన్ కార్యాలయాల్లో, ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు, జరిగిన పనులు, తదితర వివరాల సేకరనలో ఏసీబీ నిమగ్నమైనట్టు తెలిసింది. ఆయా కార్యాలయాల నుంచి పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు, సంబంధిత అధికారులతో విచారణ సాగిస్తున్నట్టుగా ప్రజా పనుల శాఖలో ప్రచారం బయలుదేరి ఉండడం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
Advertisement