
మేము చాలా మెరుగ్గా ఆడాం.. కానీ
స్వదేశంలో టీమిండియాతో జరిగిన రెండు ట్వంటీ20 మ్యాచ్ల్లో కూడా తమ జట్టు చాలా మెరుగ్గా ఆడిందని ఆస్ట్రేలియా జట్టు తాత్కాలిక కోచ్ మిచెల్ డి వెనుటూ పేర్కొన్నాడు.
సిడ్నీ: స్వదేశంలో టీమిండియాతో జరిగిన రెండు ట్వంటీ20 మ్యాచ్ల్లో కూడా తమ జట్టు చాలా మెరుగ్గా ఆడిందని ఆస్ట్రేలియా జట్టు తాత్కాలిక కోచ్ మిచెల్ డి వెనుటూ పేర్కొన్నాడు. తమ జట్టు పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే ఓడిందని తాను అనుకోవడం లేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ తమదైన ముద్రను చాటుకున్నామన్నాడు. కాగా,తమ జట్టు ఓటమికి స్పిన్ ఆడటంలో తీవ్ర ఇబ్బందులకు గురికావడమే ఒక కారణమన్నాడు.
'ఆసీస్ ఆట తీరును చూడండి. మూడు విభాగాల్లోనూ ఆకట్టుకుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మా ఆటగాళ్లు బ్యాట్ తో రాణించారు. మధ్య ఓవర్లలో ఆటగాళ్లు కుదురుకున్న సమయంలో స్పిన్ ఆడటంలో విఫలం చెంది వికెట్లు సమర్పించుకున్నారు. ఇది మినహా మా ఆటంతా అద్వితీయంగా ఉంది' అని మిచెల్ డి వెనుటూ తెలిపాడు. త్వరలో భారత్ లో జరగబోయే ట్వంటీ20 వరల్డ్ కప్ లో ఈ ఫలితం తమపై ప్రభావం చూపే అవకాశమే లేదన్నాడు. ఈ సిరీస్ లో కొంతమంది ప్రధాన ఆటగాళ్లు జట్టుతో లేకపోవడం సిరీస్ పై ప్రభావం చూపిందన్నాడు.