విధ్వంసం 2 | Virat Kohli's fastest ton scripts India's historic win vs Australia | Sakshi
Sakshi News home page

విధ్వంసం 2

Oct 31 2013 1:26 AM | Updated on Sep 2 2017 12:08 AM

విధ్వంసం 2

విధ్వంసం 2

కళ్ల ముందు 351 పరుగుల భారీ లక్ష్యం.. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్... షార్ట్ పిచ్‌లతో హడలెత్తించే ప్రత్యర్థి పేసర్లు...

ఓ సినిమా హిట్టయితే సీక్వెల్ తీయడం పరిపాటి. క్రికెట్‌లోనూ భారత్ అదే పని చేస్తోంది. పెను విధ్వంసంతో 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ధోనిసేన... సరిగ్గా రెండు వారాల తర్వాత మరోసారి దాన్ని పునరావృతం చేసింది.
 
  351 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఛేదించింది. అప్పుడు జైపూర్... ఇప్పుడు నాగ్‌పూర్... వేదిక మారిందంతే. జామ్‌తాలో పరుగుల మోత మోగింది. దీపావళికి ముందే ‘హండ్రెడ్‌వాలా’ పేలింది. భారత త్రిమూర్తుల (కోహ్లి, ధావన్, రోహిత్) సంచలన ప్రదర్శనతో... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఇక ‘ఫైనల్’ వన్డే శనివారం బెంగళూరులో జరుగుతుంది.
 
 నాగ్‌పూర్: కళ్ల ముందు 351 పరుగుల భారీ లక్ష్యం.. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్... షార్ట్ పిచ్‌లతో హడలెత్తించే ప్రత్యర్థి పేసర్లు... ఇలా ఆట కంటే ఒత్తిడే ఎక్కువగా ఉన్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు సునామీ సృష్టించారు. మొదట రోహిత్, ధావన్... ఆ తర్వాత కోహ్లి.. తమ విధ్వంసాలతో కొండంత లక్ష్యాన్ని ఉఫ్‌న ఊదేశారు.
 
 బంతిని ముట్టుకుంటే బౌండరీ... క్రీజు వదిలితే సిక్సర్... ఇలా బ్యాట్‌ను మంత్రదండలా తిప్పుతూ... మంచి నీళ్లప్రాయంలా పరుగుల వరద పారించారు. దీంతో బుధవారం వీసీఏ మైదానంలో జరిగిన ఆరో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఫలితంగా ఏడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.... ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 350 పరుగులు చేసింది. బెయిలీ (114 బంతుల్లో 156; 13 ఫోర్లు, 6 సిక్సర్లు), వాట్సన్ (94 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో హడలెత్తించారు.
 
 వోజెస్ (38 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 4 వికెట్లకు 351 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (66 బంతుల్లో 115 నాటౌట్; 18 ఫోర్లు, 1 సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగితే... ధావన్ (102 బంతుల్లో 100; 11 ఫోర్లు), రోహిత్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు చక్కని సమన్వయం కనబర్చారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య  ఏడో వన్డే శనివారం జరుగుతుంది.
 
 బెయిలీ జోరు... వాట్సన్ హోరు: ఆసీస్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో హ్యూస్ (13)ను భువనేశ్వర్ బోల్తా కొట్టిస్తే... 12వ ఓవర్‌లో ఫించ్ (20)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆసీస్ 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత బెయిలీ, వాట్సన్‌ల జోరుకు భారత బౌలర్లు చేతులెత్తేశారు. వాట్సన్ 93 బంతుల్లో కెరీర్‌లో 9వ సెంచరీ సాధించాడు. బెయిలీ 84 బంతుల్లో కెరీర్‌లో రెండో శతకం పూర్తి చేశాడు. మూడో వికెట్‌కు 168 పరుగులు జోడించాక... షమీ బౌలింగ్‌లో వాట్సన్ అవుట్ కావడంతో ధోనిసేన కాస్త ఊపీరి పీల్చుకుంది. కానీ బెయిలీ జోరుతో ఆఖరి ఓవర్లలోనూ స్కోరు వాయువేగంతో కదిలింది. నాలుగో వికెట్‌కు వోజెస్, బెయిలీ కలిసి 80 బంతుల్లోనే 120 పరుగులు జోడించారు.  అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
 

 ఓపెనర్ల శుభారంభం: రోహిత్, ధావన్ లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభాన్నిచ్చారు. తొలి పవర్‌ప్లేలో 56 పరుగులు రాబట్టారు. మాక్స్‌వెల్ వేసిన 19వ ఓవర్‌లో క్యాచ్ అవుట్‌ను తప్పించుకున్న ధావన్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. డోహెర్టీ బౌలింగ్‌లో వరుసగా ఫోర్లు కొట్టాడు. ఫించ్ (28వ ఓవర్), మాక్స్‌వెల్ (29వ ఓవర్) బౌలింగ్‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన రోహిత్... అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. తొలి వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
 
 కోహ్లి వచ్చి రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. డోహెర్టి బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో ధావన్ అవుటైనా... భారత్ రన్‌రేట్ మాత్రం తగ్గలేదు. కెరీర్‌లో నాలుగో సెంచరీ చేసిన ధావన్‌ను ఫాల్క్‌నర్ వెనక్కి పంపాడు. కోహ్లి ధాటికి ఆసీస్ బౌలర్లు బిత్తరపోయారు. ఢిల్లీ ప్లేయర్ 61 బంతుల్లో కెరీర్‌లో 17వ సెంచరీ సాధించాడు. చివర్లో రైనా అవుటైనా... ధోని (25 నాటౌట్) నిలకడగా ఆడాడు. 18 బంతుల్లో  35 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లి 4 వరుస ఫోర్లతో విజయాన్ని సులభం చేశాడు.
 
 స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హ్యూస్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 13; ఫించ్ (బి) అశ్విన్ 20; వాట్సన్ (బి) షమీ 102; బెయిలీ (సి) కోహ్లి (బి) జడేజా 156; మాక్స్‌వెల్ (సి) భువనేశ్వర్ (బి) అశ్విన్ 9; వోజెస్ నాటౌట్ 44; జాన్సన్ (సి) ధావన్ (బి) జడేజా 0; హడిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: (వైడ్లు 3, నోబాల్స్ 3) 6; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 350.
 వికెట్లపతనం: 1-30; 2-45; 3-213; 4-224; 5-344; 6-346
 
 బౌలింగ్: భువనేశ్వర్ 8-0-42-1; మహ్మద్ షమీ 8-1-66-1; రవీంద్ర జడేజా 10-0-68-2; అశ్విన్ 10-0-64-2; మిశ్రా 10-0-78-0; కోహ్లి 2-0-15-0; రైనా 2-0-17-0
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఫాల్క్‌నర్ (బి) ఫించ్ 79; ధావన్ (బి) ఫాల్క్‌నర్ 100; కోహ్లి నాటౌట్ 115; రైనా (సి) హడిన్ (బి) జాన్సన్ 16; యువరాజ్ (బి) జాన్సన్ 0; ధోని నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 8, వైడ్లు 7, నోబాల్స్ 1) 16; మొత్తం: (49.3 ఓవర్లలో 4 వికెట్లకు) 351.
 
 వికెట్లపతనం: 1-178; 2-234; 3-290; 4-290
 బౌలింగ్: జాన్సన్ 10-0-72-2; మెక్‌కే 7-0-47-0; ఫాల్క్‌నర్ 9.3-0-73-1; డోహెర్టీ 6-0-40-0; వాట్సన్ 6-0-51-0; మాక్స్‌వెల్ 7-0-40-0; ఫించ్ 4-0-20-1.
 
 9 వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో కోహ్లి 17 సెంచరీలతో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.
 
 7 కోహ్లి చేసిన 17 సెంచరీల్లో ఏడుసార్లు అజేయంగా నిలిచాడు
 
 1 తక్కువ మ్యాచ్‌ల్లో (118 వన్డేలు) 17 సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు
 
 11 ఛేజింగ్‌లో కోహ్లికిది 11వ సెంచరీ. ఈ 11 సార్లూ భారత్ నెగ్గడం విశేషం. ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ (14) పేరిట ఉంది.
 
 ఈ మ్యాచ్ ద్వారా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement