
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. బుధవారం తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ 178 పరుగులకు ఆలౌటైతే, రెండో రోజు ఆటలో లంకేయులు 104 పరుగులకే కుప్పకూలారు. 88/4 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన శ్రీలంక మరో 16 పరుగులు చేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ రోజు ఆటలో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ విజృంభించడంతో లంక పేకమేడలా కుప్పకూలింది. 15 బంతుల వ్యవధిలో నాలుగు పరుగుల మాత్రమే ఇచ్చిన బౌల్ట్.. ఆరు వికెట్లను కూల్చి లంక పతనాన్ని శాసించాడు.
ఇన్నింగ్స్ 37 ఓవర్ నాల్గో బంతికి రోషెన్ సిల్వాను పెవిలియన్కు పంపిన బౌల్ట్..ఆపై 39 ఓవర్లో మూడు వికెట్లు సాధించాగు. ఈ ఓవర్లో తొలి బంతికి డిక్వెల్లాను ఔట్ చేసిన బౌల్ట్.. ఐదో బంతికి దిల్రూవాన్ పెరీరాను, చివరి బంతికి సురంగా లక్మల్ను ఔట్ చేశాడు. ఇక బౌల్ట్ వేసిన 41 ఓవర్లో దుష్మంతా చమీరా, లహిరు కుమారాలను ఔట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. నలుగుర్ని పరుగుల ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్కు చేర్చాడు. అయితే డకౌట్గా వెనుదిరిగిన నలుగురు లంక ఆటగాళ్లు ఎల్బీ రూపంలోనే తమ వికెట్లను చేజార్చుకున్నారు. ఈ రోజు ఆటలో శ్రీలంక కోల్పోయిన ఆరు వికెట్లు బౌల్ట్ ఖాతాలో పడటం మరో విశేషం. ఆపై రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. దాంతో కివీస్ 305 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.