శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన మూడో వన్డేకు వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో రద్దయ్యింది.
ఆక్లాండ్: శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన మూడో వన్డేకు వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో రద్దయ్యింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ మ్యాచ్ ఆగిన సమయానికి 28.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆ తర్వాత మూడు గంటలపాటు వేచి చూసినప్పటికీ మ్యాచ్ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు రద్దు చేశారు.
అంతకుముందు 25 ఓవర్ల దగ్గర రెండో సారి వర్షం కురిసినప్పుడు మ్యాచ్ను 43 ఓవర్లకు కుదించారు. మార్టిన్ గుప్టిల్ (78 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు; 3 సిక్సర్లు), అజేయ అర్ధ సెంచరీ సాధించగా లాథమ్ (65 బంతుల్లో 42; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్కు మూడు వికెట్లు దక్కాయి. ఏడు వన్డేల ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో విజయంతో సమానంగా ఉన్నాయి.