
జోహెన్నెస్బర్గ్: ఇప్పటికే తమతో టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియాకు మరో చేదు అనుభవం తప్పదని అంటున్నాడు దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబడా. చివరిదైన మూడో టెస్టులో కూడా విజయం సాధించి భారత జట్టును వైట్వాష్ చేస్తామని రబడా ధీమా వ్యక్తం చేశాడు.
'ప్రతీ గేమ్లో విజయం సాధించడమే మా ముందున్న లక్ష్యం. ఆ క్రమంలోనే భారత్ను మూడో టెస్టులో కంగుతినిపించి సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తాం. భారత ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. టీమిండియా పేస్ బౌలింగ్ను గౌరవిస్తునే వారిని సమర్దవంతంగా తిప్పికొడతాం. మా జట్టు ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడినట్లే భారత క్రికెట్ జట్టు కూడా కెప్టెన్ కోహ్లిపైనే ఆధారపడుతుంది. అలా అని భారత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు లేరని అర్ధం కాదు. కానీ అందరికంటే విరాట్ ఎక్కువ పరుగులు చేస్తాడనేది వాస్తవం. అతడి లాంటి బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ సిరీస్లో భారత్ ఎలా ఆడింది అనేది మాకు ముఖ్యం కాదు.. ఆ జట్టుపై విజయం సాధించడమే ముఖ్యం' అని రబడా తెలిపాడు.