దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.
డర్బన్: దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆసీస్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఛేదించిన దక్షిణాఫ్రికా సిరీస్ లో బోణి కొట్టింది. కెప్టెన్ డు ప్లెసిస్(40; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడటంతో పాటు డేవిడ్ మిల్లర్(53 నాటౌట్;35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్(40), మిచెల్ మార్ష్(35), డేవిడ్ వార్నర్(20)లు మినహా ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ మూడు వికెట్లు సాధించగా, రబడా,వైజ్లకు తలో రెండు వికెట్లు లభించాయి.