భారత మహిళలదే వన్డే సిరీస్‌ | Smriti, Jhulan, Shikha star as India clinches ODI series | Sakshi
Sakshi News home page

భారత మహిళలదే వన్డే సిరీస్‌

Feb 25 2019 3:36 PM | Updated on Feb 25 2019 3:37 PM

Smriti, Jhulan, Shikha star as India clinches ODI series - Sakshi

ముంబై: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత మహిళలు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 41.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. తద్వారా ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్నారు.  భారత బ్యాటర్స్‌లో స్మృతీ మంధాన(63), మిధాలీ రాజ్‌(47 నాటౌట్‌), పూనమ్‌ రౌత్‌(32)లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు.

ఇంగ్లండ్‌ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఆదిలోనే రోడ్రిగ్స్‌(0) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మంధాన-పూనమ్‌ రౌత్‌ల జోడి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ఇక మూడో వికెట్‌కు మంధాన-మిధాలీ రాజ్‌ జోడి 66 పరుగుల్ని జత చేయడంతో భారత్‌ సునాయాసంగా గెలుపొందింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌  43.3 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. . ఇంగ్లండ్‌ మహిళల‍్లో  నటలీ స్కీవర్‌(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. జులన్‌ గోస్వామి, శిఖా పాండేలు చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు.  అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్‌ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మూడో వన్డే గురువారం జరుగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement