
జడేజాపై రాజ్కోట్ దృష్టి!
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్లలో అందుబాటులో ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. కాబట్టి సహజంగానే ధోనిని పుణే తీసుకోవచ్చు.
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్లలో అందుబాటులో ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. కాబట్టి సహజంగానే ధోనిని పుణే తీసుకోవచ్చు. సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియలో మైనస్ 16 కోట్ల రూపాయలతో జట్టును పుణేను గెలిచింది. రాజ్కోట్ను కొనుక్కున్న ఇంటెక్స్ మొబైల్స్ (మైనస్ 10 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తం పుణే జట్టు చెల్లిస్తోంది. కాబట్టి తొలి ఆటగాడిని పుణే ఎంచుకుంటే, రెండో క్రికెటర్ను రాజ్కోట్ తీసుకుంటుంది.ఒకవేళ ధోనిని పుణే చేజిక్కించుకుంటే.. రాజ్కోట్ జట్టు తమ తొలి ఆటగాడిగా జడేజాను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో జడేజా విశేషంగా రాణించడంతో పాటు... అతను రాజ్కోట్కే చెందిన వాడు కావడంతో తొలుత ఈ ఆల్రౌండర్ను తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఆడిన ఆటగాళ్లలో కొందరు ఇప్పుడు రెండు వేరు వేరు జట్లకు ఆడాల్సి వస్తుంది.
కొత్త జట్టు ఆటగాళ్ల కోసం కనిష్టంగా రూ.40 కోట్లు, గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయాలి. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్ను తీసుకోగానే ఇందులో నుంచి రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. ఆ తర్వాత నలుగురు క్రికెటర్లను తీసుకోగానే వరుసగా రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే వేలంలో ఈ మొత్తాన్ని తగ్గించుకుని మిగిలిన ఆటగాళ్లను కొనుక్కోవాలి.
చెన్నై, రాజస్తాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో వచ్చిన కొత్త జట్లు పుణే, రాజ్కోట్ జట్లు మంగళవారం పదిమంది క్రికెటర్లను ఎంచుకోనున్నాయి. చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ధోని, అశ్విన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, అజింక్య రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, డ్వేన్ బ్రే వో, డ్వేన్ స్మిత్ల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇంకా మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి.