భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టును చూసేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది.
ఢిల్లీ టెస్టుపై హైకోర్టు
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టును చూసేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ అభ్యర్థనను విచారించిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. అంతకుముందు రోజుకు రూ.10 టిక్కెట్తో విద్యార్థులను అనుమతిస్తామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే వారి టిక్కెట్ల ఖరీదును డీడీసీఏనే భరించాలని కోర్టు తెలిపింది.
అలాగే కాంప్లిమెంటరీ పాసులను కూడా స్వల్ప మొత్తంలోనే అందించాలని సూచించింది. మ్యాచ్ను చూసేందుకు డబ్బులు పెట్టి రాలేని పరిస్థితి ఉందని, పిల్లలతో పాటు వారి టీచర్లను కూడా అనుమతించాలని కోర్టు తెలిపింది. ఈ విషయంలో డీడీసీఏ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయవాది సునీల్ మిట్టల్ తెలిపారు.