అభిమానుల ఉత్సాహం మధ్య...

అభిమానుల ఉత్సాహం మధ్య...


తొలి టి20లో వరల్డ్‌ ఎలెవన్‌పై పాక్‌ విజయం

రాణించిన బాబర్‌ ఆజమ్‌




లాహోర్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానుల ఆనందోత్సాహం, కేరింతల మధ్య ఆ జట్టు ఇండిపెండెన్స్‌ కప్‌లో గుర్తుంచుకునే విజయాన్ని నమోదు చేసింది. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై తీవ్రవాదుల దాడి తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్లు పాక్‌లో ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే కావడంతో పాక్‌లో సంబరాలు మిన్నంటాయి. రెండేళ్ల క్రితం జింబాబ్వే ఆడినా... ఆ సిరీస్‌కు ఇంతటి ఆకర్షణ లేకపోయింది. మంగళవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాక్‌ 20 పరుగుల తేడాతో వరల్డ్‌ ఎలెవన్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది.



సొంత మైదానంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 86; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... అహ్మద్‌ షహజాద్‌ (34 బంతుల్లో 39; 3 ఫోర్లు), షోయబ్‌ మాలిక్‌ (20 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం వరల్డ్‌ ఎలెవన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. స్యామీ (29), డు ప్లెసిస్‌ (29), ఆమ్లా (26), పైన్‌ (25) ఫర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో సొహైల్, రయీస్, షాదాబ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు.   పాకిస్తాన్‌ గడ్డపై ఇప్పటివరకు జరిగిన నాలుగు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ పాక్‌ జట్టే గెలుపొందడం విశేషం. రెండో టి20 ఇదే మైదానంలో నేడు జరుగుతుంది.   



నేటి రెండో టి20 మ్యాచ్‌ సాయంత్రం గం. 6.30 నుంచి డి–స్పోర్ట్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top