టెస్టు క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు

Mushfiqur the first keeper to score two double hundreds in Test history - Sakshi

ఢాకా: టెస్టు క్రికెట్‌ చరిత్రలో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్పికర్ రహీం అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో రహీం డబుల్‌ సెంచరీ సాధించాడు. 407 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో రహీం ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది రహీంకు రెండో డబుల్‌ సెంచరీ. ఫలితంగా టెస్టు చరిత్రలో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన తొలి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఓ ఆటాడుకుంటూ తనదైన మార్కు చూపెట్టిన రహీమ్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు ఆటలో టీ బ్రేక్‌ తర్వాత రహీం ఈ ఘనత సాధించాడు. దాంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లలో మోమినుల్‌ హక్‌(161) కూడా భారీ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఐదొందల స్కోరును సునాయాసంగా చేరింది.

జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌ ఓటమి పాలైంది. దాంతో ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తోంది. 303/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేసింది. ఆదివారం సెంచరీ పూర్తి చేసుకున్న రహీమ్‌.. ఈరోజు ఆటలో దాన్ని డబుల్ సెంచరీగా మలచుకున్నాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top