తొలి మహిళా అథ్లెట్‌..

Mary Kom Recommended for Padma Vibhushan - Sakshi

న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్‌చాంపియన్‌గా నిలిచి ఇప్పటికీ తనలో పంచ్‌ పవర్‌ను చూపిస్తున్న భారత మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ పేరును పద్మ విభూషణ్‌ అవార్డుకు ప్రతిపాదిస్తూ క్రీడామంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి గాను మొత్తం తొమ్మిది మంది  మహిళా క్రీడాకారిణులతో కూడిన పద్మ అవార్డుల జాబితాను క్రీడా శాఖ తాజాగా సిద్ధం చేసింది. ఇందులో మేరీకోమ్‌ను పద్మ విభూషణ్‌కు ఎంపిక చేయగా,  తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు పేరును పద్మ భూషణ్‌కు ప‍్రతిపాదించారు. ఇటీవల వరల్డ్‌చాంపియన్‌గా సింధు నిలవడంతో ఆమెను పద్మ భూషణ్‌కు సిఫారుసు చేయడం ప్రధాన కారణం.  2015లో పద్మ శ్రీ అవార్డు అందుకున్న సింధు.. 2017లోనే పద్మ భూషణ్‌  గౌరవం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు సింధు పేరును పరిగణలోకి తీసుకోలేక పోవడంతో ఇప్పుడు ఆమె పేరును ఈ అవార్డుకు సిఫారుసు చేస్తూ కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది.

కాగా,  పద్మ విభూషణ్‌గా మేరీకోమ్‌ను ఎంపిక చేయడంతో ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఒక మహిళా అథ్లెట్‌ను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా మేరీకోమ్‌ పద్మ విభూషణ్‌కు సిఫారుసు చేయబడ్డ తొలి క్రీడాకారిణిగా నిలిచారు. ఇక మిగిలిన ఏడుగురు క్రీడాకారిణుల పద్మ అవార్డుల్లో భాగంగా  రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మానికా బాత్రా, టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌, హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌, మాజీ షూటర్‌ సుమా షిర్పూర్‌,  మౌంటైనీర్‌ ట్విన్‌ సిస్టర్స్‌ తాషి, నుంగాషి మాలిక్‌లను పద్మ శ్రీకి సిఫారుసు చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top