
రాబిన్ ఊతప్ప(ఫైల్)
ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప చివరి దాకా ఒంటరి పోరు చేసినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.
కటక్:ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప చివరి దాకా ఒంటరి పోరు చేసినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. గ్రూప్-డిలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో ఊతప్ప(80;52 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసి మహారాష్ట్ర నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కర్ణాటక ఆదిలోనే మహ్మద్ తాహా(4) ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. అనంతరం జోషి కూడా వెంటనే పెవిలియన్ కు చేరడంతో కర్ణాటక నాలుగు పరుగులకే రెండు వికెట్లు సమర్పించుకుంది. ఈ తరుణంలో ఓపెనర్ గా వచ్చిన ఊతప్ప తనదైన శైలిలో బ్యాట్ ను ఝుళిపించాడు.
ఒకపక్క వికెట్లు పడుతున్నా ఊతప్ప మాత్రం ఎదురుదాడికి దిగి మహారాష్ట్రపై ఒత్తిడి తెచ్చేయత్నం చేశాడు. కాగా, మరో ఎండ్ లో అతనికి సరైన సహకారం లభించలేదు. చివరి వరకూ ఊతప్ప ఒంటరిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. జట్టు స్కోరు 157 పరుగుల వద్ద ఊతప్ప తొమ్మిది వికెట్ గా పెవిలియన్ కు చేరగా, మరో పరుగు వ్యవధిలో కర్ణాటక ఆలౌటయ్యింది. దీంతో కర్ణాటక 26 పరుగుల తేడాతో పరాజయం చెందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నిఖీ నాయక్(67) ఆకట్టుకోగా, భాటి(39), బావ్నే(33) ఫర్వాలేదనిపించడంతో మహారాష్ట్ర గౌరవప్రదమైన స్కోరు చేసింది.