
ఒక్క సిరీస్.. లంకకు ముగ్గురు కెప్టెన్లు!
దిగ్గజ ఆటగాళ్లు సంగక్కర, జయవర్ధనే, సనత్ జయసూర్య, మురళీధరన్ల రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక జట్టు పరిస్థితి దారుణంగా ఉంది.
దిగ్గజ ఆటగాళ్లు సంగక్కర, జయవర్ధనే, సనత్ జయసూర్య, మురళీధరన్ల రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఓ వైపు వరుస ఓటములకు తోడు మరోవైపు ఆటగాళ్లకు గాయాలు.. ఈ రెండింటితో లంక జట్టు ప్రతి సిరీస్ లోనూ ఓటములను చవిచూడాల్సి వస్తోంది. భారత్తో 3-0తో టెస్టు సిరీస్ను చేజార్చుకున్న లంక, ఐదే వన్డేల సిరీస్లో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో వన్డే సిరీస్నూ టీమిండియాకు కోల్పోయింది. నాలుగో వన్డే గురువారం జరగనుంది. అయితే మ్యాచ్కి బౌలర్ లసిత్ మలింగ లంక కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఇదివరకే వన్డే సిరీస్లో జరిగిన మూడు వన్డేలకు ఇద్దరు కెప్టెన్సీ చేయగా, నాలుగో వన్డేకు మలింగ సారథిగా ఉంటాడు. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఉపుల్ తరంగపై ఐసీసీ రెండు మ్యాచ్ ల నిషేధం విధించగా.. మూడో వన్డేకి కెప్టెన్ గా వ్యవహరించిన కపుగెదెర గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో నాలుగో వన్డేకు కొత్త కెప్టెన్ వచ్చాడు. 202 వన్డేలాడిన మలింగ 196 ఇన్నింగ్స్ల్లో 299 వికెట్లు తీశాడు. తాను కెప్టెన్గా వ్యవహరించే గురువారం నాటి వన్డేలో ఒక్క వికెట్ తీస్తే వన్డేల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ చేరతాడు.
వరుస పరాజయాలతో ఉన్న లంక తదుపరి రెండు వన్డేల్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఆ రెండు వన్డేలు నెగ్గితేనే లంక జట్టు 2019 ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధిస్తోంది. లేనిపక్షంలో క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. సెప్టెంబరు 30 నాటికి ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్లో టాప్-8 జట్లే వరల్డ్ కప్నకు నేరుగా అర్హత సాధిస్తాయి. దీంతో వెస్టిండీస్-లంక జట్లు నేరుగా క్వాలిఫై కావడానికి యత్నిస్తున్నాయి.