
శిఖర్, కోహ్లిల దూకుడు:భారత్ బోణీ
ఆస్ట్రేలియా పర్యటనలో సన్నాహక మ్యాచ్ లో భాగంగా శుక్రవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ ట్వంటీ 20లో టీమిండియా 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన తొలి వార్మప్ ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా బోణీ కొట్టింది. శుక్రవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ 20లో టీమిండియా 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుని నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి192 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(6) ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా.. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ - విరాట్ కోహ్లిలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. శిఖర్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేయగా, కోహ్లి 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.
ఈ జోడీ రెండో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా భారీ స్కోరులో సహకరించింది. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద విరాట్ రెండో వికెట్ గా నిష్ర్కమించగా, మరో 12 పరుగుల వ్యవధిలో ధవన్ పెవిలియన్ చేరాడు. అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(22 నాటౌట్;14 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లు) రాణించడంతో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించకల్గింది. అజింక్యా రహానే(2) నిరాశపరిచాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసి పరాజయం చెందింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ ట్రావిస్ బిర్ట్(74 నాటౌట్;60 బంతుల్లో 11 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు.భారత బౌలర్లలో అజేయ్ జడేజా, అక్షర్ పటేల్ , బరీందర్ శ్రావణ్లకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ 20 శనివారం ఇదే స్టేడియంలో జరుగనుంది.