భారత పురుషుల హాకీ జట్టుపై మాజీ గోల్ కీపర్ ఫెర్నాండెస్ ప్రశంసలు కురిపించాడు.
టొరంటో: భారత పురుషుల హాకీ జట్టుపై మాజీ గోల్ కీపర్ ఫెర్నాండెస్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల విశేషంగా రాణిస్తున్న భారత హాకీ జట్టు.. త్వరలో జరగబోయే ఒలింపిక్స్లో పతకం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా చాంపియన్ ట్రోఫీలో భారత్ ఆద్యంతం ఆకట్టుకుందన్నాడు. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్కు చేరి సరికొత్త చరిత్రను తిరగరాసిన భారత జట్టు..ఒలింపిక్స్లో అదే స్థాయి ఆట తీరు కనబర్చడం ఖాయమన్నాడు.
' గత కొంతకాలం నుంచి భారత జట్టు ప్రదర్శన చూస్తున్నా. ప్రత్యేకంగా చాంపియన్స్ ట్రోఫీని వీక్షించా. అందులో భారత ప్రదర్శన అమోఘం. ప్రస్తుతం సమతూకంగా ఉన్న భారత హాకీ జట్టు మరొసారి ఉన్నత శిఖరాలను అధిగమించే అవకాశం ఉంది'అని 1975లో వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన ఫెర్నాండెస్ తెలిపాడు. భారత జట్టు విజయాల్లో కోచ్ ఓల్ట్మన్స్ పాత్ర వెలకట్టలేనిదన్నాడు. త్వరలో భారత హాకీ జట్టు అత్యంత శక్తిమంతమైనదిగా నిలుస్తుందని కొనియాడాడు. ఈసారి రియోలో జరిగే ఒలింపిక్స్లో భారత జట్టు పతకంతోనే తిరిగి వస్తుందని టోరొంటోలో నివసిస్తున్న ఫెర్నాండెస్ భరోసా వ్యక్తం చేశాడు.


