కోహ్లికి విశ్రాంతి.. పంత్‌కు నో చాన్స్‌ | IND Vs NZ: Kohli Was Rested For The Final T20I | Sakshi
Sakshi News home page

కోహ్లికి విశ్రాంతి.. పంత్‌కు నో చాన్స్‌

Feb 2 2020 12:19 PM | Updated on Feb 2 2020 12:19 PM

IND Vs NZ: Kohli Was Rested For The Final T20I - Sakshi

మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. కివీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న చివరి మ్యాచ్‌లో భారత జట్టు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఈ ఒక్క మార్పుతోనే టీమిండియా పోరుకు సన్నద్ధమైంది. గత మ్యాచ్‌లో రోహిత్‌కు విశ్రాంతినిస్తే, తాజా మ్యాచ్‌లో కోహ్లికి రెస్ట్‌ ఇచ్చారు. ఇది మినహా ఎటువంటి మార్పులు చేయలేదు టీమిండియా. ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌కు అవకాశం దక్కుతుందని భావించినా అది జరగలేదు.

నాల్గో టీ20లో అవకాశం దక్కించుకుని నిరాశపరిచిన సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇచ్చారు. గత మ్యాచ్‌లో విఫలమైన సంజూ సామ్సన్‌ ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే అయ్యర్, దూబేలు కూడా స్థిరమైన ప్రదర్శనపై దృష్టిపెట్టాలి. పాండేపై ఎవ రికీ ఎలాంటి అనుమానం లేదు. ఇక బౌలింగ్‌లో భారత్‌ చాలా మెరుగ్గా కనిపిస్తుంది. రెండు ‘టై’ మ్యాచ్‌ల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బౌలర్ల గురించే. షమీ తర్వాత శార్దుల్‌ కూడా నాణ్యమైన డెత్‌ బౌలర్‌గా నిరూపించుకున్నాడు.(ఇక్కడ చదవండి: నాకు వేరే చాయిస్‌ లేదు: మనీష్‌ పాండే)

ఇక న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ప్రస్తుత మ్యాచ్‌కు సైతం దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా గత మ్యాచ్‌ ఆడని విలియమ్సన్‌.. నేటి మ్యాచ్‌లో కూడా అందుబాటులోకి రాలేదు.  దాంతో కివీస్‌ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి టిమ్‌ సౌతీ తీసుకున్నాడు. ఆతిథ్య జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. గెలుపు గడపదాకా రెండు సార్లు వచ్చినా... నెగ్గలేకపోవడం జట్టును నిరాశలో ముంచింది. ఇది చాలదన్నట్లు విలియమ్సన్‌ గాయం జట్టుకు మరింత ప్రతికూలంగా మారింది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ గెలిపించాల్సిన స్థితిలో బాధ్యతని నిర్వర్తించలేకపోతున్నాడు. ఇది న్యూజిలాండ్‌ జట్టును కలవరపెడుతోంది. అందరూ సమష్టిగా రాణించి భారత జోరుకు బ్రేక్‌వేసి కనీసం పరువు అయినా కాపాడుకోవాలని న్యూజిలాండ్‌ జట్టు ఆశిస్తోంది. దాంతో మరొకసారి ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.

తుది జట్లు
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, సంజూ శాంసన్‌, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్, చహల్‌, బుమ్రా, సైనీ.  
న్యూజిలాండ్‌: టిమ్‌ సౌతీ(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్, మన్రో, రాస్‌ టేలర్, టామ్‌ బ్రూస్‌, డరైన్‌ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్‌లీన్, సోధి, బెన్నెట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement