ఆధిక్యం 51 నుంచి 183కు..

IND VS NZ 1st Test: New Zealand Bowl out For 348 In 1st Innings - Sakshi

కివీస్‌ 348 పరుగులకు ఆలౌట్‌

జేమిసన్‌, బౌల్ట్‌ బౌండరీల వర్షం

ఇషాంత్‌ ఖాతాలో ఐదు వికెట్లు

వెల్లింగ్టన్‌: ఐదు ప్రధాన వికెట్లు తీశాం.. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే తోకను కత్తిరిస్తే ఆధిక్యం వందలోపే ఉంటుందని భావించిన కోహ్లి సేనకు న్యూజిలాండ్‌ టెయిలెండర్లు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. తమ బౌలింగ్‌తో హడలెత్తించిన ఆతిథ్య బౌలర్లు బ్యాట్‌తోనూ మెరవడంతో కివీస్‌కు 183 పరుగుల మంచి ఆధిక్యం లభించింది. 51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్‌ స్కోర్‌ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్‌(14)ను ఔట్‌ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. సౌతీని ఇషాంత్‌ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది. 


ఓ వైపు గ్రాండ్‌హోమ్‌ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్‌ యథేచ్చగా బ్యాటింగ్‌ చేశాడు. బౌండరీలతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు.  కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్‌(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్‌ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్‌ బౌల్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు. దీంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ (5/68), అశ్విన్‌(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి:
ఆధిక్యం పోయింది 
ఫోన్‌ మాట్లాడుతూ దొరికిపోయాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top