మా ఓటమికి కారణం అదే: స్మిత్‌

IND VS AUS ODI Series: Steve Smith on Rajkot ODI Defeat - Sakshi

రాజ్‌కోట్‌: తొలి వన్డేలో నిరుత్సాహపరిచిన టీమిండియా.. రెండో వన్డేలో​ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తర్వాత బౌలింగ్‌లో రాణించిన టీమిండియా ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. సమిష్టిగా పోరాడి గెలిచిన భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఓ దశలో ఆసీస్‌ ఛేదించేలా కనిపించింది.. అయితే కుల్దీప్‌ ఓకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. ఇక మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఓటమిపై స్పందించాడు. అంతేకాకండా ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. ఓ దశలో విజయం తమదే అనుకున్న తరుణంలో మిడిల్‌ ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడమే కంగారు జట్టు ఓటమికి కారణని తెలిపాడు. 

‘భారీ లక్ష్య ఛేదనలో మిడిల్‌ ఓవర్లు ఎంతో కీలకం. ఈ ఓవర్లలో పరుగులు రాబట్టడం ఎంత కీలకమో.. వికెట్లను కూడా కాపాడుకోవాలి. అయితే మేము తొలి 30 ఓవర్లపాటు మంచి రన్‌రేట్‌నే కొనసాగించాం. అంతేకాకుండా చేతిలో వికెట్లు ఉండటంతో మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉందనుకాన్నం. కానీ 31 ఓవర్లో లబుషేన్‌ ఔటవ్వడం, 38వ ఓవర్‌లో నేను(స్మిత్‌), అలెక్స్‌ క్యారీ వెనుదిరగడం జట్టు ఓటమికి ప్రధాన కారణం. కుల్దీప్‌ వేసిని బంతిని కట్‌ చేయబోయి ఔటయ్యాను. ఇక రాజ్‌కోట్‌ వన్డేల్లో గేమ్‌ చేంజర్‌ కుల్దీప్‌ యాదవే. ఇక అరంగేట్ర వన్డేల్లో లబుషేన్‌ ఆకట్టుకున్నాడు. అతడికి మంచి భవిష్యత్‌ ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌లు అద్భుతంగా ఆడారు. ఒకటి రెండు ఇన్నింగ్స్‌లు ఆడనంత మాత్రాన రోహిత్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అతడి రికార్డులే అందరికీ సమాధనం చెబుతాయి. ఇక కీలక నిర్ణయాత్మక వన్డేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలవాలనుకుంటున్నాం’అని స్మిత్‌ పేర్కొన్నాడు. ఇక ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే రేపు(ఆదివారం) బెంగళూరులో జరగనుంది. 

చదవండి: 
వ్యూహం మార్చి అదరగొట్టారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top