దెబ్బతిన్న పులుల్లా..! | fourth Test match starts To day | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న పులుల్లా..!

Aug 7 2014 1:45 AM | Updated on Sep 2 2017 11:28 AM

దెబ్బతిన్న పులుల్లా..!

దెబ్బతిన్న పులుల్లా..!

ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్టుల తర్వాత భారత జట్టు ఒక్కసారిగా ఇంగ్లండ్ కంటే చాలా బలంగా కనిపించింది. కానీ తమకే సాధ్యమైన నిర్లక్ష్యపు ఆటతీరుతో మూడో టెస్టులో ఘోరంగా ఓడిపోయింది.

కసి మీదున్న భారత క్రికెటర్లు
 కానీ భారీగానే సమస్యలు
 నేటి నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు

 
 మ. గం. 3.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో

 
 తమని అవమానించిన క్రికెటర్‌ను ఏం చేయకుండా వదిలేశారనే కసి... ఐసీసీ తమ మాటను తీసిపారేసిందనే ఉక్రోశం... తమని బూతులు తిట్టిన ప్రత్యర్థి ఆటగాడు నవ్వుతూ మైదానంలో తిరుగుతుంటే కలుగుతున్న ఆవేశం... ఇదీ ఇప్పుడు భారత క్రికెటర్ల పరిస్థితి. మూడో టెస్టు ముగిశాక జరిగిన విచారణలో పూర్తిగా భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం రావడం... తప్పు చేశానని చెప్పిన అండర్సన్‌కు శిక్ష పడకపోవడం ధోని సేనను బాధించింది. అయితే ఆ కసిని మైదానంలో తమ ఆటతీరుతో తీర్చుకుంటే అంతకంటే కావలసిందేమీ ఉండదు.
 
 మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్టుల తర్వాత భారత జట్టు ఒక్కసారిగా ఇంగ్లండ్ కంటే చాలా బలంగా కనిపించింది. కానీ తమకే సాధ్యమైన నిర్లక్ష్యపు ఆటతీరుతో మూడో టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. దీంతో దాదాపు ఏడాది తర్వాత ఇంగ్లండ్‌కు ఓ విజయం లభించడంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చారిత్రక ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో భారత్‌తో గురువారం మొదలయ్యే నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కచ్చితంగా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టీమిండియాకు మాత్రం మూడు టెస్టుల తర్వాత తుది జట్టు కూర్పుపై మళ్లీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
   
 మార్పులు తప్పవు!
 ఈ మ్యాచ్‌కు భారత జట్టు కనీసం మూడు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్‌గా విజయ్‌తోపాటు గౌతమ్ గంభీర్‌కు అవకాశం ఇవ్వచ్చు. అలాగే భువనేశ్వర్ గాయం నుంచి కోలుకోనందున అతడి స్థానంలో వరుణ్ ఆరోన్ జట్టులోకి రావచ్చు. జడేజా స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇషాంత్ ఫిట్‌నెస్‌తో లేనందున పంకజ్ సింగ్‌ను కొనసాగిస్తారా లేక ఈశ్వర్ పాండేకు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరం. పిచ్ స్వింగ్, పేస్ బౌలర్లకు సహకరిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టాప్ ఆర్డర్ మీద భారం ఎక్కువగా పడనుంది. ఓపెనర్లతో పాటు పుజారా నిలకడగా ఆడితేనే మ్యాచ్‌లో భారత్ నిలబడుతుంది. మిడిలార్డర్‌లో కోహ్లి ఫామ్‌లో లేకపోవడం, రోహిత్ శర్మ గత మ్యాచ్‌లో ప్రదర్శన కాస్త ఆందోళన కలిగించేవే. రహానే ఒక్కడే మిడిలార్డర్‌లో కాస్తో కూస్తో ఇప్పటిదాకా ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, ఇషాంత్ లేకుండా పేస్‌కు సహకరించే పిచ్‌పై 20 వికెట్లు ఎలా తీస్తారో చూడాలి.
 
 ఉత్సాహంలో ఇంగ్లండ్
 మూడో టెస్టులో విజయం తర్వాత అండర్సన్‌పై విచారణలో తీర్పు తమకు అనుకూలంగా రావడం ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం పెంచింది. ఏడాది కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కెప్టెన్ కుక్ గాడిలో పడటం.. బ్యాలెన్స్, రూట్‌లు అద్భుతంగా ఆడుతుండటం ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టంగా తయారు చేసింది. స్పిన్నర్‌గా మరోసారి మొయిన్ అలీపైనే ఆధారపడతారు.
 
 అయితే భారత్‌కు ప్రధానంగా సమస్యలు సృష్టించగలిగేది మాత్రం అండర్సన్. ఈ పేసర్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీనికి తోడు ఇది అండర్సన్‌కు సొంత మైదానం. కాబట్టి భారత బ్యాట్స్‌మెన్‌కు అతి పెద్ద సవాల్ అండర్సనే.
 
 జట్లు (అంచనా):  భారత్: ధోని (కెప్టెన్), విజయ్, ధావన్/గంభీర్, పుజారా, కోహ్లి, రహానే, రోహిత్/జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఆరోన్.
 
 ఇంగ్లండ్:  కుక్ (కెప్టెన్), రాబ్సన్, బ్యాలెన్స్, బెల్, రూట్, అలీ, బట్లర్, వోక్స్, బ్రాడ్, అండర్సన్, జోర్డాన్/ఫిన్.
 
 8 ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో భారత్ 8 టెస్టులు ఆడితే మూడు ఓడి, ఐదింటిని డ్రా చేసుకుంది. ఒక్క విజయం కూడా ఈ మైదానంలో దక్కలేదు.
 
 6 ఇంగ్లండ్ ఇక్కడ ఆడిన చివరి 8 టెస్టుల్లో ఆరు గెలిచి, రెండు డ్రా చేసుకుంది.
 
 24 ఈ మైదానంలో భారత్ 1990 తర్వాత టెస్టు ఆడటం ఇదే తొలిసారి. 24 ఏళ్ల క్రితం ఆడిన మ్యాచ్‌లో సచిన్ తన కెరీర్ తొలి సెంచరీతో భారత్‌ను ఓటమినుంచి కాపాడాడు.
 
 పిచ్
 వికెట్‌పై ఎక్కువగా గడ్డి లేకపోయినా...ఈ సిరీస్‌లోని గత టెస్టులతో పోలిస్తే ఓల్డ్‌ట్రాఫర్డ్‌ను వేగవంతమైన పిచ్‌గా చెప్పవచ్చు. కాబట్టి పేసర్లదే హవా.
 
 వాతావరణం
 మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఉదయం లేదా రాత్రి చిరు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ఇంగ్లండ్ వాతావరణంలో ఇది చాలా సహజం. కాబట్టి మ్యాచ్‌కు వరుణుడి నుంచి పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు.
 
 ‘నాటింగ్‌హామ్ వివాదంలో నేను నిజం వైపే నిలబడ్డాను. తప్పు ఎవరు చేసినా దానిని వ్యతిరేకిస్తా. సాక్ష్యం లేకపోవడం వల్లే తీర్పు అలా వచ్చింది కాబట్టి దాని గురించి ఇక మాట్లాడటం అనవసరం.
 
 దీని వల్ల నాకు అవమానం జరిగినట్లు కాదు. ఐసీసీ దృష్టికి తీసుకు రావడమే తప్ప నేను శిక్ష వేయలేను. అండర్సన్‌పై వ్యక్తిగత కక్ష లేదు. టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే. కానీ 500కు పైగా స్కోరు చేస్తేనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. గురువారం పిచ్‌ను చూశాకే తుది జట్టును ఎంపిక చేస్తాం’     
 - భారత కెప్టెన్ ధోని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement