
భారత మహిళల ఓటమి
టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టును తొలి వన్డేలో ఇంగ్లండ్ నిలువరించింది.
ఇంగ్లండ్తో తొలి వన్డే
స్కార్బోరోగ్ (ఇంగ్లండ్): టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టును తొలి వన్డేలో ఇంగ్లండ్ నిలువరించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 42 పరుగుల తేడాతో నెగ్గింది. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వర్షం రావడంతో మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. ఓపెనర్ స్మృతి మందానా (99 బంతుల్లో 74; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సహాయంతో భారత్ 47 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 34; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్కు మందానా 64 పరుగులు జోడించింది. నైట్కు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసిన సమయంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్లు ఎడ్వర్డ్స్ (64 బంతుల్లో 57; 9 ఫోర్లు), నైట్ (71 బంతుల్లో 53; 6 ఫోర్లు) జోరుతో 30.1 ఓవర్లలో ఇంగ్లండ్ మూడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ సమయంలో మళ్లీ భారీవర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ 30.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోతే 112 పరుగులు చేస్తే గెలిచినట్లు. అప్పటికే 153 పరుగులు చేసినందున... 42 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు.