క్రికెటర్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు..విచారణకు ఆదేశం

CSA investigating racial abuse towards Tahir - Sakshi

సాక్షి స్పోర్ట్స్‌: దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య జరిగిన నాలుగో వన్డే సమయంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై క్రికెట్‌ దక్షిణాఫ్రికా, వాండరర్స్‌ స్టేడియం భద్రతా టీం విచారిస్తున్నాయి. పింక్‌ వన్డే జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల్లోని ఓ గుర్తుతెలియని వ్యక్తి తాహిర్‌ను అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో తాహిర్‌ సదరు ప్రేక్షకుడితో గొడవపడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని  స్టేడియం భద్రతా సిబ్బందికి తాహిర్‌ తెలిపాడు. దీంతో భద్రతా సిబ్బంది వచ్చి ఆ ప్రేక్షకుడిని స్టేడియం బయటకు తీసుకువెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఓ వీడియో హల్‌చల్‌ చేస్తుంది. తాహిర్‌తో ప్రేక్షకుడు ఘర్షణ పడుతుండటాన్ని పక్కనే ఉన్న మరో ప్రేక్షకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, జాతి వివక్ష వ్యాఖ్యలు చోటుచేసుకుంటే సహించేదిలేదని, తప్పు ఎవరిదైనా చర్యలు తప్పవని క్రికెట్‌ దక్షిణాఫ్రికా అధికారులు వెల్లడించారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top