క్రికెట్కు గుడ్ బై చెప్పి.. మంత్రి అయ్యాడు | Cricket to politics: Laxmi Ratan Shukla's new innings | Sakshi
Sakshi News home page

క్రికెట్కు గుడ్ బై చెప్పి.. మంత్రి అయ్యాడు

May 27 2016 7:26 PM | Updated on Aug 30 2019 8:37 PM

క్రికెట్కు గుడ్ బై చెప్పి.. మంత్రి అయ్యాడు - Sakshi

క్రికెట్కు గుడ్ బై చెప్పి.. మంత్రి అయ్యాడు

బెంగాల్ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా దేశవాళీ క్రికెట్కు గుడ్ బై చెప్పి ఆరు నెలలు కూడా కాకముందే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.

కోల్కతా: బెంగాల్ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా దేశవాళీ క్రికెట్కు గుడ్ బై చెప్పి ఆరు నెలలు కూడా కాకముందే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్లో శుక్లా కు బెర్తు దొరికింది. 35 ఏళ్ల శుక్లా ఇక మీదట పశ్చిమబెంగాల్ మంత్రి.

పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమత వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మమతతో పాటు 42 మంది మంత్రులు ప్రమాణం చేశారు. 18 ఏళ్ల దేశవాళీ క్రికెట్ కెరీర్కు గత డిసెంబర్లో గుడ్ బై చెప్పిన శుక్లా ఎన్నికలకు ముందు తృణమాల్ కాంగ్రెస్లో చేరారు. టీఎంసీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన శుక్లా తొలిప్రయత్నంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉత్తర హౌరా నియోజకవర్గం నుంచి పోటీచేసిన శుక్లా  దాదాపు 27 వేల ఓట్ల మెజార్టీతో లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి పాఠక్ను ఓడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో క్రీడా ప్రముఖులు టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ (కేరళ), భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (పశ్చిమబెంగాల్) ఓటమి చవిచూడగా, శుక్లా మాత్రం తొలిసారి ఎమ్మెల్యేగా  ఎన్నిక కావడంతో పాటు ఏకంగా మంత్రి అయ్యారు. శుక్లా టీమిండియా తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు ఆడారు.

Advertisement
 
Advertisement
Advertisement