పోలీసుల చిత్రహింసలు తప్పించుకునేందుకే... | Sakshi
Sakshi News home page

పోలీసుల చిత్రహింసలు తప్పించుకునేందుకే...

Published Thu, Jan 31 2019 1:05 AM

Confessed to crime as police threatened to implicate my family, Sreesanth tells SC - Sakshi

న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని... తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని భారత మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. దీనిపై కేరళకు చెందిన ఈ మాజీ పేసర్‌ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్‌ ఈ కేసును విచారించింది. పోలీస్‌ టార్చర్‌ నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్‌ నిందను మోశాడని అతని లాయర్‌ కోర్టుకు వివరించారు.

శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్‌ కోర్టుకు అందజేశాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్‌ ఆ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్‌ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దీన్నిబట్టి శ్రీశాంత్‌ ప్రవర్తన ఎలాంటిదనే విషయం తేటతెల్లమవుతోందని బెంచ్‌ స్పష్టం చేసింది.   
 

Advertisement
Advertisement