
కేరళ క్రికెట్ సంఘం క్రమశిక్షణా చర్యలు
తిరువనంతపురం: భారత మాజీ పేస్ బౌలర్ ఎస్.శ్రీశాంత్పై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) తీవ్ర చర్యలు తీసుకుంది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతనిపై మూడేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కేరళ ఆటగాడు సంజు సామ్సన్ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులోకి ఎంపిక కాకపోవడంతో శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఒక మళయాళ టీవీ చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ... సామ్సన్ను విజయ్ హజారే వన్డే టోర్నీకి కేరళ క్రికెట్ సంఘం ఎంపిక చేయకపోవడం తప్పుడు నిర్ణయమని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. దీని వల్లే అతను చాంపియన్స్ ట్రోఫీ అవకాశాలు కోల్పోయాడని అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలో కేరళ సంఘంపై పలు ఆరోపణలు చేసిన అతను... సామ్సన్తో పాటు ఇతర కేరళ క్రికెటర్లకు తాను అండగా ఉంటానని, కేరళ సంఘం నుంచి వారిని రక్షిస్తానని అతను పేర్కొన్నాడు. ఇదే కారణంగా శ్రీశాంత్పై వేటు పడింది. ఈ వివాదం మొదలైన సమయంలో శ్రీశాంత్తో పాటు కేరళ క్రికెట్ లీగ్లో అతను సహ యజమానిగా ఉన్న కొల్లామ్ ఏరీస్ టీమ్కు కూడా కేసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
‘నేను తప్పు చేయలేదు’
కేసీఏ తనపై నిషేధం విధించడంపై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే అసలు నేను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదు. సామ్సన్ మనవాడు. అందుకే ఒక మంచి ఉద్దేశంతో అతడికి మద్దతు పలికానంతే. కేసీఏను ఎక్కడా విమర్శించలేదు. అసోసియేషన్లో ఉన్నవారు కాస్త పెద్ద స్థాయిలో క్రికెట్ ఆడిన వారైతే బాగుండేది అని మాత్రమే అన్నాను.
సామ్సన్ మాత్రమే కాదు కేరళ ఆటగాళ్లు ఎవరికైనా మనం అండగా నిలవాలి నాపై నిషేధం వెనక ఎలాంటి కారణం ఉందో నాకు అర్థం కాలేదు. కేరళ అభిమానులే దీనిని నిర్ణయించండి’ అని శ్రీశాంత్ చెప్పాడు. భారత్ తరఫున 90 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన శ్రీశాంత్ టి20, వన్డే వరల్డ్ కప్లు గెలిచిన జట్లలో భాగంగా ఉన్నాడు.